మేం ఊరు మారలేదు

ABN , First Publish Date - 2021-05-18T05:45:40+05:30 IST

టిడ్కో గృహాలకు సంబంధించిన ఎలాట్‌మెంట్‌ పొందిన లబ్ధిదారులు ఊరు మారలేదని, యజమాని జీవించే ఉన్నట్లు ధ్రువీకరణలను సమర్పించాలని ఏపీ టిడ్కో ఎండీ కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మేం ఊరు మారలేదు

టిడ్కో ప్లాట్ల లబ్ధిదారులు కొత్త ధ్రువీకరణ ఇవ్వాల్సిందే

భీమవరం, మే 17 : టిడ్కో గృహాలకు సంబంధించిన ఎలాట్‌మెంట్‌ పొందిన లబ్ధిదారులు ఊరు మారలేదని, యజమాని జీవించే ఉన్నట్లు ధ్రువీకరణలను సమర్పించాలని ఏపీ టిడ్కో ఎండీ కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్లాట్లు కేటాయింపు పొందిన లబ్ధిదారులలో ఇటీవల నోటీసు అందుకున్న వారందరూ తమ పాత ఎలాట్‌మెంట్‌ లెటర్లను మున్సిపాలిటీలలో అందజేస్తే కొత్తగా నవరత్నాల సైట్‌లో ఆన్‌లైన్‌ చేస్తారని ఏపీ టిడ్కో ఎండీ కార్యాలయం నుంచి ఈ నెల 13న ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ఆధారంగా జిల్లాలో టిడ్కో గృహాలు నిర్మించిన భీమవ రం, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో లబ్ధిదారులు ఈ ధ్రువీకరణలను ఆయా మునిసిపల్‌ కార్యాలయాలకు సమర్పించాలని ఆదేశించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి, లాటరీ పద్ధతిన ప్లాట్లు గతంలోనే కేటాయించారు. వార్డు సచివాలయాల సమాచారంతో తదుపరి ప్రభుత్వం ఇచ్చిన సేల్‌ అగ్రిమెంట్లను నిలుపుదల చేశారు. దీనిపైనే గతం లో లబ్ధిదారులకు నోటీలిచ్చారు. ప్రధానంగా ఊరు మారడం, డెత్‌ సమాచారం వంటి లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడం ద్వారా అర్హత, అనర్హతల నిర్ధారణ కోసమేనని భావిస్తున్నారు. నోటీసుల ఆధారంగా వాటిని ధ్రువీకరించుకోవాలి. ఈ ప్రకారం టిడ్కో లబ్ధిదారులలో ఇక్కడే ఉంటున్నామని, ఒకవేళ యజమాని మృతి చెందితే వివరాలన్నింటినీ సమర్పించాలి. నోటీసులు అందుకున్న లబ్ధిదారులు తమ దగ్గర వున్న పాత అలాట్‌మెంట్‌ లేఖలను సోమవారం నుంచి వారం రోజుల్లో స్థానిక మునిసిపల్‌ కార్యాలయాలకు సమర్పించాలని ఉత్తర్వులో సూచించారు. టిడ్కో మార్గదర్శకాల ఆధారంగా అర్హత కలిగిన వారిని కొత్త దరఖాస్తులలో నమోదు చేసి, నవరత్నాలు సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. మూడు పట్టణాలలో వేలాది మంది నోటీసులందుకున్నారని తెలుస్తోంది. 


Updated Date - 2021-05-18T05:45:40+05:30 IST