లంచం తీసుకుంటూ..
ABN , First Publish Date - 2021-04-17T05:26:59+05:30 IST
ఇంటి పన్ను పేరు మార్పిడికి రూ.1500 లంచం తీసుకుంటూ వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ శుక్రవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
భీమవరం, ఏప్రిల్ 16 : ఇంటి పన్ను పేరు మార్పిడికి రూ.1500 లంచం తీసుకుంటూ వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ శుక్రవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. భీమవరం ఆరో వార్డు బొక్కావారిపాలెంకు చెందిన గూడూరి శ్రీనివాస్ తన ఇంటి పన్ను పేరు మార్పు చేయాలని మున్సిపల్ వార్డు సచివాలయానికి వెళ్లాడు. వార్డు అడ్మిన్ కార్యదర్శి పెచ్చెట్టి ఆంజనేయులుతో మాట్లాడితే రూ.1500 ఖర్చవుతుందని చెప్పాడు. అప్పటికే చాలా కాలంగా అతని చుట్టూ తిరిగిన శ్రీనివాస్ విసిగిపోయి.. ఏసీబీని ఆశ్రయించారు. సొమ్ము ఇవ్వడానికి అంగీకరించడంతో సెక్రటరీ ఆంజనేయులు మున్సిపల్ ఆఫీసుకు రమన్నాడు. దీంతో ట్రాప్ వేసిన ఏసీబీ సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో రెవెన్యూ ఛాంబర్ వద్ద రూ.1500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని డీఎస్పీ వెంకటేశ్వరరావు చెప్పారు. దాడిలో సీఐలు ఎం.రవిచంద్ర, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.