మందకొడిగా మొక్కజొన్న కొనుగోళ్లు
ABN , First Publish Date - 2021-05-15T06:27:58+05:30 IST
మొక్కజొన్న కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.
334 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
2,559 మంది రైతులు రిజిస్ట్రేషన్
కొనుగోలు చేసింది 15వేల క్వింటాళ్లు
ఏలూరు సిటీ, మే14: మొక్కజొన్న కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడం, కొనుగోలు కేంద్రా లను ఆలస్యంగా తెరవడంతో కొంతమంది రైతులు మొక్కజొన్న పంట అమ్మ డం కోసం దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు అయిన కాడికి వచ్చిన ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది.కొనుగోలు కేంద్రాల్లో క్వింటా లుకు రూ.1,880 మద్దతు ధర కల్పిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.1,200 నుంచి రూ.1,500 వరకు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు చెబుతు న్నారు. ఇటీవల ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షాలకు కోసిన మొక్కజొన్న పంట పూర్తిగా తడిసిపోయిందని, ఆ పంటను ఆర బెట్టినా గిట్టుబాటు ధర రాని పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు రైతులు వాపోయారు.
334 కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోళ్లు
మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి జిల్లాలో 334 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 272 రైతు భరోసా కేంద్రాల్లో, 62 సహకార సంఘాలలో కొనుగోళ్లు చేస్తున్నట్టు సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. కమర్షియల్ మొక్కజొన్న పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి 2,559 మంది రైతులు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 15వేల క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కొనుగోళ్లు జరిగాయని మార్క్ఫెడ్ శాఖాధికారులు చెబుతున్నారు.