పోలీసులపైనే భారం!
ABN , First Publish Date - 2021-05-08T06:13:37+05:30 IST
ఫ్రంట్ లయన్ వారియర్స్గా పోలీసులు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు.
పెను సవాల్గా మారిన కరోనా నియంత్రణ
ఏలూరు క్రైం, మే 7: ఫ్రంట్ లయన్ వారియర్స్గా పోలీసులు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. మొదటి దశ కరోనా వ్యాప్తి చెందకుండా నిద్రహారాలు మాని విధులు నిర్వర్తించారు. రెడ్జోన్ల వద్ద అనేక ఇబ్బందులు పడుతూనే గస్తీ నిర్వహించారు. ఎంతో మంది కరోనా పాలైనప్పటికీ ఆత్మస్ధైర్యంతో కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. 500 మంది పోలీసులకు పాజిటివ్ నిర్ధారణ కాగా, తొమ్మిది మంది కరోనా కాటుకు బలవగా, మరో ముగ్గురు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది ఉన్నారు. రెండో దశ కరోనా జిల్లాలో మార్చి 19 నుంచి ప్రవేశించి పెరుగుతూనే ఉంది. పోలీసులు వెనకడుగు వేయకుండా విధులు నిర్వర్తిస్తూనే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలతోపాటు జిల్లా ఎన్నికల్లోనూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 101 మంది పోలీసులు కరోనా వేవ్ టు వైరస్ పాజిటివ్ అయి హోం ఐసొలేషన్లో ఉం డగా, మరి కొందరు ఆసుపత్రిల్లో చేరారు. వారి కుటుంబ సభ్యులు మరో 50 మందికి పాజిటివ్ వచ్చింది. మొదటి కరోనా వైరస్తో ఒక హోమ్ గార్డు మరణించగా, రెండో వైరస్కు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఒక ఉద్యోగి మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం కర్ఫ్యూ విధుల్లో పోలీసులు గస్తీలు నిర్వ హిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 12 గం టల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండడంతో ఆ సమ యంలోను ప్రజలు భౌతిక దూరం పాటించేలాగ, మాస్క్లు ధరించేలాగ చర్యలు తీసుకుంటున్నారు. మొదటి కరోనా కాలంలో పోలీసులకు ఆ శాఖ ఉన్నతాధికారులు మాస్క్లు, శానిటైజర్లు, గ్లౌజులు అందించారు. కానీ కరోనా వేవ్ టు వైరస్ జిల్లాలో ప్రవేశించి రెండు నెలలు నిండిపోయినా పోలీసులకు మాత్రం రక్షణ కవచాలను ఆ శాఖ ఇంత వరకూ అందించలేదు. పనిఒత్తిళ్లకు గురవుతున్న అధికారులు గుండెపోట్లకు గురవుతున్నారు.
గుండెపోటుతో సీఐ రాంబాబు, ఇంటెలిజెన్స్ ఎస్ఐ మృతి
ఏలూరు క్రైం/నిడదవోలు/తణుకు, మే 7 : కరోనా వేళ గుండె పోటు మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజులోనే రాజమహేంద్రవరం అర్బన్ సీఐ చింతా రాంబాబు, నిడదవోలు ఇంటెలిజెన్స్ ఎస్ఐ సీహెచ్ సాయిబాబా(57), తణుకు సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ విప్పర్తి కమలాకర్ గుండె పోటుతో మరణించారు. పి.గన్నవరం మండలం చింతావారి పేటకు చెందిన రాంబాబు 1991లో ఎస్ఐగా చేరారు. జంగారెడ్డిగూడెం, భీమడోలు, దెందులూరు, నిడదవోలు, తణుకు తదితర ప్రాంతాల్లో ఎస్ఐగా, సీఐగా పనిచేశారు. శుక్రవారం తెల్లవారుజామున విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటు రావడంతో మరణించారు. మంచి అధికారిగా పేరు పొందారు. సాయంత్రం పోలీసు లాంఛనాలతో స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్ఐ సాయిబాబా ఉదయం విధులు నిర్వహించి మధ్యాహ్నం ఇంటిలోనే కుప్పకూలి మృతిచెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తణుకు సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కమలాకర్ ఈ నెల 4న పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ, ఇంతలోనే ఆయన గుండెపోటుతో మృత్యువాత పడడంతో న్యాయవర్గాల్లో విస్మయం కలిగిస్తోంది.