పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలి
ABN , First Publish Date - 2021-12-05T05:50:21+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నెల ఏడో తేదీ నుంచి నిరసనలు చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల ధర్నా
ఏలూరు కలెక్టరేట్, డిసెంబరు 4 : ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నెల ఏడో తేదీ నుంచి నిరసనలు చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. కలెక్టరేట్ వద్ద ఆయా సంఘాల ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ కె.రమేష్కుమార్, ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ ఆర్ఎస్ హరనాధ్, కన్వీనర్ చోడగిరి శ్రీనివాసరావు, మాట్లాడుతూ పదకొండో పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ, పెండింగ్ డీఏల విడుదల, జీపీఎఫ్, సరెండర్ లీవ్ తదితర ఆర్థిక ప్రయోజనాలు వంటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయన్నారు. జేసీ బీఆర్ అంబేడ్కర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కన్వీనర్ ఆర్.వెంకట రాజేష్, టి.రామారావు, టి.కృష్ణ, బి.శ్రీధర్రాజు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.