కంపు భరించలేం

ABN , First Publish Date - 2021-06-14T04:08:23+05:30 IST

నగరంలో ఎటు చూసినా అపారిశుధ్యం తాండవిస్తోంది.

కంపు భరించలేం
శనివారపుపేటలో ఇళ్ల మధ్యలో ఇది దుస్థితి

నగరంలో పారిశుధ్యం అధ్వానం

కానరాని డ్రెయినేజీల నిర్వహణ

ఇళ్ల మధ్యలోకి మురుగు

రోడ్ల పక్కనే వ్యర్థాల డంపింగ్‌

ఎటుచూసినా పందుల స్వైర విహారం


ఏలూరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఎటు చూసినా అపారిశుధ్యం తాండవిస్తోంది. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కొన్ని రోజులు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత ఆ వైపు తిరిగి చూడడం లేదు. ఫలితంగా డ్రెయినేజీ వ్యవస్థ రోజు రోజుకూ అధ్వానంగా తయారవుతోంది. భరించలేని దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. గత డిసెంబరులో వింత వ్యాధి సోకినప్పడు డ్రెయినేజీల పూడిక తీసి, మరమ్మతులతో కొద్ది రోజులు హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని అసలు పట్టించుకోలేదు. ఏప్రిల్‌, మే నెలల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ విరుచుకు పడడంతో మళ్లీ కొద్ది రోజులు హడావుడి చేశారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో పదిహేను రోజులు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టిన అధికారులు కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ రిలాక్స్‌ అయ్యారు. ఫలితంగా నగరంలో ఎక్కడ చూసినా డ్రెయినేజీలు మురుగుతో నిండి అధ్వానంగా మారాయి.

ఏలూరులోని అమీనాపేట కాజ్‌వే దగ్గర డ్రెయినేజీ పూడుకుపోయి మురుగు పేరుకుపోయింది. శనివారపు పేట కాజ్‌వే ఎప్పటిలాగే డ్రెయినేజీ డంప్‌గా మారిపోయింది. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో శనివారపు పేటలో ఇళ్ల మధ్యలో మురుగు నీరు నిలిచిపోయింది. దీంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వింత వ్యాధి భయం వీడని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదే ప్రాంతంలో డ్రెయినేజీల కోసం తవ్విన గుంతలు అలాగే వదిలేయడంతో ఊరిలో ఉన్న మురుగు మొత్తం తవ్విన గుంతల్లో నిలిచిపోయింది. ఇంటిలోంచి రోడ్లమీదకు కూడా రావడా నికి వీలు లేనంతగా ఈ గుంతలు పెరిగిపోయాయి. విద్యానగర్‌లో రోడ్డు పక్కనే ఉన్న డంపింగ్‌ కేంద్రం పందులకు ఆవాసంగా మారి అత్యంత ప్రమాదకరంగా తయారయింది. పవర్‌ పేట రైల్వేస్టేషన్‌ వద్ద మందు బాబులు వదిలేసిన ప్లాస్టిక్‌ గ్లాసులు, వాటర్‌ ప్యాకెట్లతో దారుణంగా మారగా, బోసుబొమ్మ సెంటరులో డ్రెయినేజీ పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు డ్రెయినేజీ ప్రవాహాన్నే అడ్డుకున్నాయి. వీటిని తొలగించి మురుగు బెడద తప్పించాలని నగరవాసులు కోరుకుంటున్నారు.

Updated Date - 2021-06-14T04:08:23+05:30 IST