విద్యార్థి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2022-01-24T04:16:30+05:30 IST
విద్యార్థి అదృశ్యమయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో పోలీసులు స్పందించకపోవడం వలనే తమ బిడ్డ అనుమానాస్పద స్థితిలో మరణించాడని మృతుడి బంధువులు ఆందోళన చేప ట్టారు.
ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడు : బంధువుల ఆరోపణ
ఆస్పత్రి వద్ద రోడ్డుపై ధర్నా.. న్యాయం చేయాలంటూ డిమాండ్
ఏలూరుక్రైం, జనవరి 23: విద్యార్థి అదృశ్యమయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో పోలీసులు స్పందించకపోవడం వలనే తమ బిడ్డ అనుమానాస్పద స్థితిలో మరణించాడని మృతుడి బంధువులు ఆందోళన చేప ట్టారు. ఎస్ఐ వ్యంగ్యంగా మాట్లాడారని, కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిం చారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ రెండు గంటలపాటు రహ దారిపై ధర్నా చేశారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి న్యాయం చేస్తా మని హామీ ఇచ్చి ధర్నా విరమింపజేశారు. మృతుడి బంధువులు తెలిపిన వివ రాల ప్రకారం.. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రుకు చెందిన పట్టా లక్ష్మీనారా యణ, సీతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాంబాబు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడైన పట్టా ఉపేంద్ర (22) ఏలూరులోని ఒక కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. ఈనెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఫోన్ కాల్ రావడంతో ఇంటి నుంచి హడావుడిగా బయటకు వెళ్లాడు. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దీనిపై ఏలూరు రూరల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్ఐ ఎన్.లక్ష్మణబాబు వ్యంగ్యంగా మాట్లాడి అవమాన పరిచారంటూ ఉపేంద్ర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు స్టేషన్కు వెళ్లినా ఏమీ పట్టించు కోకుండా గంటల కొద్దీ స్టేషన్ వద్దే ఉంచారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని దుగ్గిరాల బైపాస్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం ముళ్ల పొదల్లో ఉపేంద్ర మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కన్పించింది. ఈ సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ కె.వి.ఎస్.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ శంకర్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిం చారు. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా, సెల్ఫోన్, పెన్ను ఉండడాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి త రలించారు. మృతుడు ధరించిన దుస్తులు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. రూరల్ ఎస్ఐ లక్ష్మణబాబు కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే ఉపేం ద్ర ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆస్పత్రి అత్యవసర విభాగాల వద్ద ధర్నాకు దిగారు. ఆపై ఆస్పత్రి ఎదురుగా ఉన్న రహదారిపై ధర్నా చేశారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ నాయకులు అక్కడకు చేరుకున్నారు. ఏలూరు రూరల్ సీఐ ఎన్.దుర్గాప్రసాద్, త్రీటౌన్ సీఐ ప్రసాద్, టూటౌన్ ఎస్ఐలు కిషోర్ బాబు, బి.నాగబాబు, త్రీటౌన్ ఎస్ఐ శంకర్ సిబ్బందితో చేరుకుని సీఐ దర్గాప్రసాద్ కుటుంబ సభ్యులతో చర్చించారు. కాపు నాయకుడు జల్లా హరికృష్ణ మృతుడి బంధువులకు నచ్చచెప్పారు. తమ బిడ్డను హతమార్చారనే అనుమానం ఉంద ని, ఆ దిశగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని, అదృశ్య మయ్యాడనే ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోని ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై రూరల్ సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.