కాల్వల కింద వరి నాట్లు 97.82 శాతం పూర్తి
ABN , First Publish Date - 2021-01-17T05:43:30+05:30 IST
ఈసారి కాల్వల కింద ఏప్రిల్ నాటికి రబీ సాగు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందస్తు సాగు చేపట్టాలని జిల్లా వ్యవ సాయ శాఖ నిర్ణయించింది.
మెట్ట ప్రాంతంలోనూ ముమ్మరం
ఏలూరు సిటీ, జనవరి 16 : ఈసారి కాల్వల కింద ఏప్రిల్ నాటికి రబీ సాగు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందస్తు సాగు చేపట్టాలని జిల్లా వ్యవ సాయ శాఖ నిర్ణయించింది. జిల్లాలో గోదావరి కాల్వల కింద లక్షా 42 వేల హెక్టార్లలో సాగు చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు లక్షా 39వేల హెక్టార్లలో అంటే 97.82 శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. మిగిలినవి రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ గౌసియాబేగం తెలిపారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో కూడా నాట్లు ముమ్మరంగా సాగు తున్నాయి. ఇక జిల్లా మొత్తం మీద లక్షా 69 వేల హెక్టార్లలో వరిసాగు చేయాలని నిర్ణయించారు. ఇందులో కాల్వల కింద సాగు మినహాయిస్తే మెట్ట ప్రాంతంలో 27 వేల హెక్టార్లలో మాత్రమే రబీ సాగు జరుగుతోంది. బెంగాల్ నాట్లు వేయాలని నిర్ణయించడంతో కొంత ఊపందుకుంది. జిల్లా యంత్రాంగం ముందస్తు సాగు చేయాలని నిర్ణయించినా కొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్యలు తలెత్తడంతో ఆలస్యం తప్పలేదు. ఆకివీడు, భీమవరం, పాలకోడేరు, వీరవాసరం, యలమంచిలి, నరసాపురం, పోడూరు మండలాల్లోని కొన్ని ప్రాం తాల్లో వరినాట్లు ఇంకా పడలేదు.