వారికి ఆధారమేదీ?
ABN , First Publish Date - 2022-01-23T05:00:31+05:30 IST
మనిషిగా బతుకుతున్నామే తప్ప మేము ఒకరున్నామన్న ఆలోచన ఏ ఒక్కరికీ లేదు. మమ్మల్ని గుర్తించమని కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా ఏ ఒక్కరూ కనికరం చూపడం లేదని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆధార్, రేషన్కార్డుల కోసం అధికారుల చుట్టూ పడిగాపులు
ఖాజీపేట, జనవరి 22: మనిషిగా బతుకుతున్నామే తప్ప మేము ఒకరున్నామన్న ఆలోచన ఏ ఒక్కరికీ లేదు. మమ్మల్ని గుర్తించమని కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా ఏ ఒక్కరూ కనికరం చూపడం లేదని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం మారప్ప (70), యల్లమ్మ (68) కర్ణాటకలోని హుబ్లీ ప్రాంతం నుంచి వచ్చి ఖాజీపేటలోని అయ్యప్ప గుడి నిర్మాణ ప్రాంతంలో నివాసం వుంటున్నారు. తమకంటూ ఎటువంటి ఆవాసం లేక ఎవరైనా కొంచెం పెడితే తిని బతుకు నావను సాగదీస్తున్నారు. మేమందరిలాగే జీవిస్తామని మాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇప్పించాలని అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు. పింఛన్ను దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్, ఆధార్ కార్డు కావాలని అడుగుతున్నారని, ఏమి చేయాలో దిక్కుతోచడం లేదని చెబుతున్నారు. కాగా మారప్ప ప్రమాదంలో ఒక కన్ను కూడా కోల్పోయాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు రేషన్, ఆధార్ కార్డులతో పాటు పింఛన్, ఇల్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు.