కొవిడ్ పరీక్షల కనికట్టు?
ABN , First Publish Date - 2021-06-18T05:19:04+05:30 IST
కొవిడ్ పరీక్షలు చేయకుండానే.. చేసినట్టు నమోదు చేసి పలువురు ఆరోగ్య సిబ్బం ది కిట్లు పక్కదారి పట్టిస్తున్నారా...! అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరీక్షలు చేయకుండానే.. చేసినట్టు
శాంపిల్ తీసుకున్నట్టు, నెగెటివ్ వచ్చినట్టు ఫోన్కు మెసేజ్లు
ఇలా చూపి.. కిట్లు పక్కదారి పట్టిస్తున్నారని పలువురు సందేహాలు
నర్సీపట్నం, జూన్ 17 : కొవిడ్ పరీక్షలు చేయకుండానే.. చేసినట్టు నమోదు చేసి పలువురు ఆరోగ్య సిబ్బం ది కిట్లు పక్కదారి పట్టిస్తున్నారా...! అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షలు చేయించుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. వార్డు పరిధిలోని ఆశా కార్యకర్తలు, వలంటీర్ల వద్ద ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్లు ఉంటాయి. ఇదే అదనుగా తీసుకొని పలువురి ఆధార్ నంబరు ఎంటర్ చేసి, పరీక్షలు చేయ కుండానే చేసినట్టు నర్సీపట్నంలో నమోదు చేస్తున్నారనే వాదనలు విని పిస్తున్నాయి.
అనుమానాలు బలపడేందుకు ఓ ఉదాహరణ!
మునిసిపాలిటీ పరిధి 22వ వార్డు లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్న గూడుపు జగదీశ్, శ్రావణి, దీపిక, అప్పలరాజులకు కొవిడ్ పరీక్షలు చేసినట్టు మూడు రోజుల క్రితం ఫోన్కు మెసేజ్ వచ్చింది. వారి వద్ద నుంచి నమూనాలు సేకరించినట్టు, పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్టు శాంపిల్ ఐడీతో సహా ఆ మెసేజ్లో పేర్కొన్నారు. ఓటీపీ సహాయంతో ఐసీఎంఆర్ లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చునని మెసేజ్లో ఉంది. అంతేకాకుండా 104 కాల్ సెంటర్ నుంచి తరుచూ ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుండడంతో వారంతా ఆశ్చర్యపోతున్నారు. శాంపిల్ కలెక్షన్ చేయకుండానే కొవిడ్ పరీక్షలు ఎలా చేశారో అర్థం కావడం లేదని అంటున్నారు. తొలుత కొవిడ్ పరీక్షలు చేయించుకుంటారా... అని ఆశా కార్యకర్త అడిగితే జగదీశ్ కుటుంబ సభ్యులు అక్కర్లేదని చెప్పారు. కానీ చేసినట్టు ఫోన్కి మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోతున్నారు.
కిట్లు పక్కదారిపడుతున్నాయా..?
ఆధార్ నంబరు ప్రకారం కొవిడ్ పరీక్షలు చేసినట్టు నమోదు చేసి, కిట్లను పలువురు ప్రైవేటు ల్యాబ్లకు విక్రయించుకుంటున్నారా.. ? అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతోంది. ప్రైవేటు ల్యాబ్లలో ఈ పరీక్షలు చేయించుకుంటే ఫలితాలు అధికారికంగా ఇవ్వడం లేదు. నోటిమాటగా నెగెటివ్, పాజిటివ్ అని చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న కొవిడ్ పరీక్ష కిట్లను పలువురు ఆరోగ్య సిబ్బంది ప్రైవేటు ల్యాబ్లు, ఆస్పత్రులకు దారిమళ్లిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జర పాలని పలువురు కోరుతున్నారు.