తరగతులెప్పుడు?
ABN , First Publish Date - 2020-12-03T08:08:50+05:30 IST
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మూతపడిన మెడికల్ కాలేజీలను తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన
మెడికల్ కాలేజీల పునః ప్రారంభానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్ర సర్కారు
ప్రభుత్వ నిర్ణయం కోసం వైద్య విద్యార్థుల ఎదురుచూపులు
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మూతపడిన మెడికల్ కాలేజీలను తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. అయితే మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర సర్కారు ఇంతవరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. డిసెంబరు 1 నుంచి వైద్య విద్య తరగతులను ప్రారంభించాలని నేషనల్ మెడికల్ కమిషన్ సైతం సూచించింది.
అయినప్పటికీ తెలంగాణలో వైద్యవిద్య ఉన్నతాధికారులకు కనీస పట్టింపు లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సిఫార్సుల మేరకు తరగతులు నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కాలేజీలను ఎప్పుడు ప్రారంభిస్తారా అని చాలామంది విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, ఇంకా మొదలుపెట్టకపోతే పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని కేంద్రం అంటోంది.
కాగా, మెడికల్ కాలేజీల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎదురుచూస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, కాబట్టి తరగతులు ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై ఇంతవరకు స్పష్టత లేదని హెల్త్ యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో తరగతులు నిర్వహించడం కూడా ఒక పెద్ద సమస్యగా మారిందని వర్సిటీ అంటున్నారు.
ఇక ఎంబీబీఎస్ విద్యార్ధులకు ఆన్లైన్ తరగతుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, ప్రాక్టికల్స్ లేకపోవడంతో వారు నేర్చుకునేది చాలా తక్కువగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.