కరెన్సీ నోటుపై Mahatma gandhi బొమ్మ ఎప్పుడు పడింది.. అంతకు ముందు ఏ గుర్తులు ఉండేవో తెలుసా..
ABN , First Publish Date - 2021-10-02T23:48:57+05:30 IST
కరెన్సీ అనగానే టక్కున గుర్తొచ్చేది.. మహాత్మా గాంధీ ఫొటోనే. కానీ బాపూ బొమ్మను ఎప్పటినుంచి ముద్రిస్తున్నారు, అంతకు ముందు నోటుపై ఏ బొమ్మలు ఉండేవి.. అనే విషయాలు చాలా మందికి తెలీదు. స్వాతంత్ర్యానికి ముందు మన కరెన్సీ నోటుపై ఎవరి
కరెన్సీ అనగానే టక్కున గుర్తొచ్చేది.. మహాత్మా గాంధీ ఫొటోనే. కానీ బాపూ బొమ్మను ఎప్పటినుంచి ముద్రిస్తున్నారు, అంతకు ముందు నోటుపై ఏ బొమ్మలు ఉండేవి.. అనే విషయాలు చాలా మందికి తెలీదు. స్వాతంత్ర్యానికి ముందు మన కరెన్సీ నోటుపై ఎవరి బొమ్మ ఉండేది.. ఆ బొమ్మను తీసి, ఏ ఫొటో పెట్టారో తెలుసా..? ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు.. గాంధీ జయంతి సందర్భంగా పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మనకు 1947లో స్వాతంత్ర్యం వచ్చిన విషయం తెలిసిందే. అంతవరకు మన దేశంలోని కరెన్సీపై ఆంగ్లేయులు.. కింగ్ జార్జ్ చిత్రాలను ముద్రించేవారు. స్వాతంత్ర్యం అనంతరం 1950 జనవరి 26న మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అప్పటి నుంచి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నోట్లను ముద్రిస్తోంది. ఆర్బీఐ అధికారిక సమాచారం మేరకు.. 1949లో భారత ప్రభుత్వం మొదటిసారి రూపాయి నోటును డిజైన్ చేసింది. బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ చిత్రానికి బదులుగా.. గాంధీ బొమ్మతో డిజైన్ను రూపొందించారు. అయితే వివిధ కారణాల వల్ల గాంధీ బొమ్మ కాకుండా అశోక స్తంభం ఫొటోను ముద్రించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో 1950లో అశోక స్తంభం డిజైన్తో రూ.2, రూ.5, రూ.10, రూ.100 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని నోట్లకు వెనుకవైపు పడవ బొమ్మ ఉండేది. 1954లో రూ. 1000, రూ.2000, రూ.10,000 నోట్లను తీసుకొచ్చారు. అయితే తిరిగి 1978లో వాటిని రద్దు చేశారు. రూ.2, రూ.5 నోట్లపై కొన్ని మార్పులు చేసి.. జింక, సింహాల బొమ్మలను ముద్రించారు. అలాగే 1972లో తొలిసారిగా రూ.20లు, 1975లో రూ.50ల నోటును తీసుకొచ్చారు.
గాంధీ బొమ్మను ఎప్పుడు వేశారంటే..
మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా 1969లో తొలిసారి కరెన్సీ నోట్లపై తొలిసారిగా బాపూ బొమ్మను ముద్రించారు. సేవాగ్రామ్ ఆశ్రమం ముందు గాంధీ కూర్చుని ఉన్న ఫొటోను ముద్రించారు. మరోవైపు 1975 నుంచి రూ.100 నోట్లపై వ్యవసాయ స్వయం సమృద్ధి, తేయాకు తోటల్లో ఆకులు తెంపే మహిళలు తదితర ఫొటోలను ముద్రించడం మొదలుపెట్టారు. అలాగే రూపాయి నోటుపై చమురు బావి, రెండు రూపాయల నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం, రూ.5 నోటుపై ట్రాక్టర్తో పొలం దున్నుతున్న రైతు, రూ.10 నోటుపై కోణార్క్ మందిరం, నెమలి, శాలిమార్ గార్డెన్ తదితర ఫొటోలను ముద్రించారు.
తర్వాత పూర్తి భద్రతా ప్రమాణాలతో..
1987 అక్టోబర్లో తొలిసారిగా రూ.500 నోటును ముద్రించారు. దీనిపై గాంధీ బొమ్మ, వాటర్ మార్క్లో అశోక స్తంభాన్ని ముంద్రించారు. అప్పటి నుంచి పూర్తి భద్రతా ప్రమాణాలతో గాంధీ సిరీస్ నోట్ల ముద్రణను ప్రారంభించారు. అంధులు కూడా గుర్తుపట్టేలా నోట్లను తయారు చేశారు. ప్రస్తుతం మరింత సెక్యూరిటీతో రూ.500, రూ.1000, రూ.2000 నోట్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా.. కరెన్సీ నోటుపై బోసి నవ్వులతో ఉన్న గాంధీ బొమ్మ.. రాష్ట్రపతి భవన్లోని వైస్రాయ్ హౌస్లో ఉంటుంది. 1946లో గాంధీజీ మయన్మార్కు చేరుకున్న సమయంలో ఈ ఫొటోను తీశారట. అయితే ఎవరు తీశారనేది తెలీదు.