మన సైనికులు చనిపోతుంటే, పాక్‌తో క్రికెట్ అవసరమా? : మోదీని నిలదీసిన ఒవైసీ

ABN , First Publish Date - 2021-10-19T22:03:17+05:30 IST

జమ్మూ-కశ్మీరులో సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతూ అమరులవుతూ

మన సైనికులు చనిపోతుంటే, పాక్‌తో క్రికెట్ అవసరమా? : మోదీని నిలదీసిన ఒవైసీ

హైదరాబాద్ : జమ్మూ-కశ్మీరులో సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతూ అమరులవుతూ ఉంటే, భారత్-పాక్ క్రికెట్ జట్లు అక్టోబరు 24న టీ20 మ్యాచ్ ఆడటమేమిటని తెలంగాణా ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపైనా, లడఖ్‌లో చైనా తిష్ఠ వేయడంపైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడటం లేదన్నారు. 


అసదుద్దీన్ ఒవైసీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు అంశాల గురించి ఎన్నడూ మాట్లాడరన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల గురించి, లడఖ్‌లో మన భూభాగంలో చైనా తిష్ఠ వేయడం గురించి ఆయన ఎన్నడూ మాట్లాడరన్నారు. చైనా గురించి మాట్లాడాలంటే మోదీకి భయం అన్నారు. జమ్మూ-కశ్మీరులో వివిధ ఆపరేషన్స్‌లో తొమ్మిది మంది సైనికులు ఇటీవల అమరులయ్యారన్నారు. ఇటువంటి సమయంలో అక్టోబరు 24న పాకిస్థాన్‌తో భారత్ టీ 20 మ్యాచ్ ఆడుతోందన్నారు. ‘‘మన సైనికులు అమరులయ్యారు. మీరు టీ20 ఆడతారా? పాకిస్థాన్ రోజూ భారత దేశ ప్రజలతో కశ్మీరులో 20-20 ఆడుతోంది’’ అన్నారు. ఉగ్రవాదులు కశ్మీరులో సామాన్యులను చంపుతుండటం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 


బిహార్ నుంచి కశ్మీరు వెళ్ళి, ఉపాధి పొందుతున్న ఓ వీథి వ్యాపారిని ఉగ్రవాదులు ఇటీవల హత్య చేశారు. శ్రీనగర్‌లో హిందూ, సిక్కు టీచర్లను హత్య చేశారు. ఓ ఫార్మసిస్టును కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో ఒవైసీ మాట్లాడుతూ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని చెప్పారు. 


Updated Date - 2021-10-19T22:03:17+05:30 IST