Khairatabad Ganesh నిమజ్జనం ఎక్కడ.. కోర్టు తీర్పు నేపథ్యంలో సందిగ్ధం..!?
ABN , First Publish Date - 2021-09-14T12:01:22+05:30 IST
పీఓపీ వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించిన...
- ప్రత్యామ్నాయాలపై జీహెచ్ఎంసీ దృష్టి
- పీఓపీ విగ్రహాల కోసం బేబీ పాండ్స్
- గ్రేటర్లో 25 మినీ కొలనులు
పీఓపీ వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. హుస్సేన్సాగర్తో పాటు ఇతర చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారి్స(పీఓపీ) విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో నిమజ్జనం కోసం బేబీ పాండ్స్ (మినీ నిమజ్జన కొలనులు)ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై సందిగ్ధత ఏర్పడింది.
హైదరాబాద్ సిటీ : గ్రేటర్లో 25 బేబీ పాండ్స్ ఉన్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం గతంలో నిర్మించిన కొలనులను బతుకమ్మ ఘాట్లుగా కూడా వినియోగిస్తున్నారు. ఇప్పుడీ కొలనుల వద్ద పూర్తిస్థాయి నిమజ్జనం కోసం సిద్ధం చేస్తున్నారు. మట్టి గణపతుల నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా వద్ద నాలుగు క్రేన్లు ఏర్పాటు చేశారు. చాలా వరకు కొలనులు ఒకే పరిమాణంలో ఉన్నాయని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు. మెట్లతో నిర్మించిన కొలనులో పై భాగం 100 అడుగుల పొడవు, వెడల్పు ఉంటుంది. అడుగున 60/30 అడుగుల వెడల్పు ఉంటుంది. కొలనుల లోతు 12 నుంచి 14 అడుగులు ఉంటుంది. ఆదివారం నుంచే పలు కొలనుల్లో నిమజ్జనం మొదలైంది. ప్రస్తుతం ఎనిమిది అడుగుల మేర నీళ్లు నింపి నిమజ్జనం చేస్తున్నట్టు ఖైరతాబాద్ జోన్కు చెందిన ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఒకరు తెలిపారు. నిమజ్జనం చేసిన విగ్రహాలను మరునాడు ఉదయం తొలగిస్తున్నారు. అవసరాన్ని బట్టి 10 అడుగులు, అంతకంటే ఎక్కువ నీటిని నింపుతామని ఓ అధికారి చెప్పారు.
ఎక్కడికక్కడే నిమజ్జనం...
గ్రేటర్లో 25 వేల వరకు విగ్రహాలు ఏర్పాటు చేశారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. మహా నిమజ్జనం వచ్చే ఆదివారం జరగనుంది. ఒకేసారి అన్ని విగ్రహాలు నిమజ్జనం చేసిన పక్షంలో కొలనుల వద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఐదు, ఆరు, ఏడు, తొమ్మిదో రోజు విగ్రహాలు నిమజ్జనం చేసేలా పోలీసుల సహకారంతో నిర్వాహకులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలోని బేబీ పాండ్స్లో నిమజ్జనం చేసేలా పోలీసులు మండపాల వారీగా పాసులు జారీ చేయనున్నారు.
పెద్ద విగ్రహాలకు ప్రత్యేక ఏర్పాట్లు
కోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనంపై చర్చ జరుగుతోంది. ఈ యేడాది 40 అడుగుల ఎత్తులో విగ్రహం ప్రతిష్టించారు. హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసే అవకాశం లేకపోవడంతో జల విహార్ సమీపంలోని బేబీ పాండ్లో నిమజ్జనం చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. నెక్లె్సరోడ్ మార్గంలో ఉన్న బేబీ పాండ్కు మహా గణపతిని తీసుకెళ్లడం అం త సులువా, కొలను వద్ద ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేయ డం, నిమజ్జనం సాధ్యమా అన్నది ఆసక్తికరంగా మారిం ది. ఆ బేబీపాండ్ వద్ద కుదరని పక్షంలో పీవీ ఘాట్ సమీపంలోని కొలనులో నిమజ్జనం చేసే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. బాలాపూర్, ఇతర ప్రాంతాల్లోని పెద్ద విగ్రహాల నిమజ్జనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.