కరోనా సమయంలోనూ కనిపించని పరిశుభ్రత.. ఎందుకింత నిర్లక్ష్యం!
ABN , First Publish Date - 2021-05-08T13:11:00+05:30 IST
ఇప్పటికే చెరువు కట్ట వాహనాల అక్రమ పార్కింగులకు అడ్డాగా మారగా ...
- స్వచ్ఛ్ సర్వేక్షణ్ ఎక్కడ సారూ..?
- కరోనా సమయంలోనూ కనిపించని పరిశుభ్రత
- దుర్గంధ భరితం హస్మత్ పేట చెరువు కట్ట
- చెత్తలో పందుల వీరంగం
- ఇదెక్కడి నిర్లక్ష్యమంటున్న స్థానిక జనం
హైదరాబాద్/ఓల్డుబోయినపల్లి : ఓల్డుబోయినపల్లి హస్మత్పేట చెరువు కట్ట చెత్తా చెదారంతో నిండిపోయింది. చెరువుకట్ట చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాణదారులు కట్టపై ఇంటి నిర్మాణ వ్యర్థాలను డంప్ చేస్తున్నారు. రోజురోజుకు ఇలా పోస్తుండడంతో కట్టపై అవి పేరుకు పోతున్నాయి. చెరువులోనుంచి తీసిన చెత్తను కట్టమీదే వేయడం, దీనికి తోడు స్థానికులు సైతం చెత్తను వేస్తుండడంతో దుర్గంధభరితంగా మారింది. ఇప్పటికే చెరువు కట్ట వాహనాల అక్రమ పార్కింగులకు అడ్డాగా మారగా తాజా చెత్తకుప్పలతో డంపింగ్ యార్డును తలపిస్తోంది. చెత్త తొలగింపునకు సర్కిల్ అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టక పోవడంతో చెత్త కుప్పల్లో పందులు చేరి మరింత దుర్భరంగా మారుస్తున్నాయి.
స్వచ్ఛసర్వేక్షణ్ అంటూ అధికారులు చేసిన హడావుడి మూన్నాళ్ల ముచ్చటేనా అని విమర్శిస్తున్నారు. కరోనా ఉధృతి సమయంలో చెత్తను తొలగించక పోవడం ఏంటని అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు. చెరువును, చెరువు కట్టను అభివృద్ధి చేసి మినీ ట్యాంక్బండ్గా తీర్చి దిద్దుతామని ప్రజా ప్రతినిధులు చేసిన ప్రకటనలకు ప్రస్తుతమున్న పరిస్థితికి పొంతన లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు చెరువుకట్టపై పేరుకు పోతున్న చెత్తా చెదారాన్ని, ఇంటి నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.