శ్మశానానికీ దారి కరువేనా?
ABN , First Publish Date - 2021-12-08T07:17:20+05:30 IST
శ్మశానానికి వెళ్లడానికి దారిలేక చినవెంకటంపల్లెకు చెందిన ఎస్సీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
తీవ్ర ఇబ్బంది పడుతున్న చినవెంకటంపల్లెకు చెందిన ఎస్సీలు
ఐరాల, డిసెంబరు 7: ఎప్పుడు వర్షాలొచ్చినా శ్మశానానికి వెళ్లడానికి దారిలేక ఐరాల మండలంలోని కామినాయనపల్లె పంచాయతీ చినవెంకటంపల్లెకు చెందిన ఎస్సీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గార్గేయ నదికి అవతలి వైపున వీరికి సంబంధించిన శ్మశానం ఉంది. దీనివల్ల వర్షాలొచ్చిన ప్రతిసారీ నదిలో నీటి ఉధృతి ఉండటంతో దారిలేక అవస్థ పడాల్సి వస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం జయమ్మ (65) అనే వృద్ధురాలు చనిపోవడంతో నదిలో పారుతున్న మోకాటి లోతు నీటిలో మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లి ఖననం చేయాల్సి వచ్చిందని గ్రామస్తులు వాపోయారు. ఇకనైనా తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.