మీరు తిని పడేస్తుంటే.... వాళ్ళు Bandagesగా వాడుతున్నారు

ABN , First Publish Date - 2021-10-06T00:27:16+05:30 IST

ఆహార వ్యర్థాలను బయట పారేయకుండా, సద్వినియోగం చేసే

మీరు తిని పడేస్తుంటే.... వాళ్ళు Bandagesగా వాడుతున్నారు

సింగపూర్ : ఆహార వ్యర్థాలను బయట పారేయకుండా, సద్వినియోగం చేసే సమగ్ర విధానాన్ని సింగపూర్‌లోని నన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్‌టీయూ) శాస్త్రవేత్తలు రూపొందించారు. డురియన్ పండ్ల తొక్కలను ఉపయోగించి, ఆహార వ్యర్థాలతో యాంటీబాక్టీరియల్ జెల్ బ్యాండేజ్‌ను తయారు చేస్తున్నారు. ఈ పండ్ల తొక్కల నుంచి వచ్చే సెల్యులోజ్ పొడిని దీని కోసం ఉపయోగిస్తున్నారు. 


డురియన్ పండ్ల తొక్కలను జాగ్రత్తగా కోసి, వాటిని ఎండబెట్టి సెల్యూలోజ్ పొడిని సేకరిస్తున్నారు. దానిని గ్లిజరాల్ అనే ద్రావణంలో కలుపుతున్నారు. ఈ మిశ్రమం మృదువైన హైడ్రోజెల్ రూపంలోకి మారుతోంది. దీనిని బ్యాండేజ్ స్ట్రిప్స్‌గా కత్తిరించి, ఉపయోగిస్తున్నారు. 


ఈ విశ్వవిద్యాలయంలోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ విలియం చెన్ మాట్లాడుతూ, సింగపూర్‌ ప్రజలు సంవత్సరానికి దాదాపు 12 మిలియన్ల డురియన్ పండ్లను వినియోగిస్తారన్నారు. ఈ పండ్ల తొక్కలు, గింజలు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయని చెప్పారు. తాము అభివృద్ధిపరచిన సాంకేతిక పరిజ్ఞానం ఇతర ఆహార పదార్థాల వ్యర్థాలను కూడా హైడ్రోజెల్‌గా మార్చుతుందని చెప్పారు. సంప్రదాయ బ్యాండేజిలతో పోల్చినపుడు ఆర్గనో-హైడ్రోజెల్ బ్యాండేజిలు గాయం ఉన్న శరీర భాగంలో తడిగా, చల్లగా ఉండేలా చేస్తాయని, గాయం నయమవడం వేగవంతమవుతుందని తెలిపారు. ఈ బ్యాండేజీల తయారీకి ఖర్చు కూడా తక్కువేనన్నారు.



Updated Date - 2021-10-06T00:27:16+05:30 IST