వైట్బర్లీ రైతు వర్రీ
ABN , First Publish Date - 2021-04-21T05:10:38+05:30 IST
దిగజారుతున్న వైట్బర్లీ ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
దిగజారుతున్న ధరలు
పెరిగిన పెట్టుబడులు
ఇళ్లలోనే మగ్గుతున్న పంట
కొనేవారు లేక ఆందోళన
పర్చూరు, ఏప్రిల్ 20: దిగజారుతున్న వైట్బర్లీ ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఈ పంట సాగు ప్రకృతి వైపరీత్యాలతో ఒడిదుడుకుల మధ్య సాగింది. సాగు ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలతో పంట దెబ్బతింది. మరలా శ్రమకోర్చి తిరిగి సాగుచేశారు. ఈక్రమంలో పెట్టుబ డి భారీగా పెరిగింది.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సాగుఖర్చుతోపాటు, వ్యవసాయ కూలీల ఖర్చుకూడా కొంతమేర పెరిగింది. ఇంతచేసి పంట చేతికి అందివచ్చే సమయానికి నిలకడ లేని ధరల తో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తొలి దశలో లోగ్రేడ్ పొగాకు క్వింటా రూ. 5వేల వరకు పలకటంతో. నాణ్యమైన పొగాకు రూ.8వేలకు పైగా ఉంటుందని రైతులు ఆశించారు. వారి ఆశలు ఆడి యాశలవుతున్నాయి. ప్రస్తుతం నాణ్యమైన పొగాకు ను కొనేవారు లేక వైట్బర్లీ రైతులను కలవరానికి గురిచేస్తుంది. అరకొర కొనుగోళ్ళు జరుగుతున్నా క్విం టాకు రూ.6వేలకు మించి లేకపోవటంతో ఏమిచే యాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.
పర్చూరు వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోని ప ర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, యద్దనపూడి మండా లల్లో 20వేల ఎకరలకు పైగా వైట్బర్లీ సాగుచేశారు. వ్యవసాయ ఖర్చులు, కౌలు కలుపుకుని ఎకరానికి రూ.90వేలు పైగా ఖర్చయింది. వాతావరణ పరిస్థి తుల నేపథ్యంలో ఎకరానికి సరాసరి 10 నుంచి 12 క్వింటాళ్ళకు మించి దిగుబడులు రాలేదని రైతులు పేర్కొన్నారు. ఉన్న ధరలు, దిగుబడుల దృష్ట్యా పెట్టి న పెట్టుబడులు కూడా వచ్చే విధంగా లేదని రైతు లు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన పొగాకు క్వింటా రూ.8వేలకు పైగా ఉంటేనే పెట్టిన పెట్టుబ డులయినా వస్తాయి. వ్యాపారులు సిండికేట్ అయి ధరలను దిగజార్చేందుకే కొనుగుళ్లు పూర్తిస్థాయిలో చేపట్డడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైట్బర్లీ పొగాకుకు నాణ్యమైన ధర కల్పించి కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.