ఎవరు శాపగ్రస్తులు?

ABN , First Publish Date - 2021-09-12T05:30:00+05:30 IST

విజయనగర పట్టణ పొలిమేరల్లో రామయ్య అనే వృద్ధుడు నివసిస్తూ ఉండేవాడు. అతడికి శాపం ఉందని, ఎవరైనా అతని ముఖం చూస్తే, చూసిన వారు ఆకలి కోల్పోతారని ప్రజలు చెప్పుకొనేవారు...

ఎవరు శాపగ్రస్తులు?

విజయనగర పట్టణ పొలిమేరల్లో రామయ్య అనే వృద్ధుడు నివసిస్తూ ఉండేవాడు. అతడికి శాపం ఉందని, ఎవరైనా అతని ముఖం చూస్తే, చూసిన వారు ఆకలి కోల్పోతారని ప్రజలు చెప్పుకొనేవారు. ఆ నోటా ఈ నోటా అది శ్రీకృష్ణదేవరాయల చెవిన పడింది. దాంతో నిజమేందో తెలుసుకోవాలని ఆయన అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్యను తన వ్యక్తిగత గది దగ్గరకు తీసుకురమ్మని భటులను ఆదేశించాడు. రాజు ఆదేశం మేరకు వాళ్లు రామయ్యను తీసుకొచ్చి గది బయట ఉంచారు. రాజు ఉదయాన నిద్రలేవగానే రామయ్య ముఖం చూశాడు. తరువాత కాలకృత్యాలు తీర్చుకుని టిఫిన్‌ తినేందుకు కూర్చున్నాడు. సిబ్బంది రాజుకు టిఫిన్‌ వడ్డించారు. ఆ టిఫిన్‌లో ఒక ఈగ ఉండటాన్ని రాజు గమనించాడు. వెంటనే కోపంగా మళ్లీ తాజాగా టిఫిన్‌ సిద్ధం చేయమని ఆదేశించాడు. వాళ్లు టిఫిన్‌ రెడీ చేసి తీసుకొచ్చేలాగా రాజు ఆకలి పోయింది. రామయ్య ముఖం చూడటం వల్లే ఇలా జరిగిందని మనసులో అనుకున్నాడు. కోపంతో ‘రామయ్యను ఉరితీయండి’ అంటూ భటులను ఆదేశించాడు. ఆ విషయం రామయ్య భార్యకు తెలిసింది. వెంటనే సహాయం చేయమని అర్థిస్తూ తెనాలి రామకృష్ణ దగ్గరకు వెళ్లింది. జరిగింది తెలుసుకున్న రామకృష్ణ సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు.  మరుసటి రోజు రామకృష్ణ రామయ్య దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పి పంపించాడు. భటులు రామయ్యను ఉరితీసేందుకు సిద్ధం కాగానే ‘‘ఆపండి!  నాకు చివరి కోరిక ఉంది’’ అన్నాడు. ఏంటని భటులు అడిగితే.. ‘‘నన్ను ఉరితీయకముందే ఈ కాగితాన్ని రాజుకి అందించండి’’ అన్నాడు. రామయ్య కోరిక మేరకు భటులు ఆ కాగితాన్ని రాజుకు అందించారు. అందులో ‘‘రామయ్య ముఖాన్ని చూస్తే ఆకలిపోతుందని అనుకుందాం. కానీ ఉదయాన్నే రాజు గారి ముఖం చూస్తే జీవితమే పోతుంది. ఇక్కడ ఎవరు శాపగ్రస్తులు?’’ అని రాసి ఉంది. అది చదివిన రాజు తన తప్పేంటో తెలుసుకున్నాడు. రామయ్యను విడుదల చేయమని ఆదేశించాడు. తెనాలి రామకృష్ణ చెవిలో చెప్పిన విషయాన్ని పాటించడం ద్వారా రామయ్య బయటపడ్డాడు.

Updated Date - 2021-09-12T05:30:00+05:30 IST