సెప్టెంబరు వరకూ బూస్టర్ డోసులపై మోరటోరియం: డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2021-08-05T07:39:41+05:30 IST

ప్రపంచంలో కరోనా డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, ఐరోపా దేశాలు, భారత్ వంటి దేశాల్లో ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోంది.

సెప్టెంబరు వరకూ బూస్టర్ డోసులపై మోరటోరియం: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచంలో కరోనా డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, ఐరోపా దేశాలు, భారత్ వంటి దేశాల్లో ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ప్రజలను ఈ ప్రమాదకరమైన వేరియంట్ నుంచి కాపాడటం కోసం అమెరికా వంటి దేశాలు ‘బూస్టర్ డోస్’పై దృష్టి సారిస్తున్నాయి. అంటే సాధారణంగా తీసుకునే వ్యాక్సిన్ రెండు డోసులకు అదనంగా మరో వ్యాక్సిన్ డోసును ప్రజలకు అందిస్తారు. ఇలా చేయడం వల్ల ప్రజల శరీరాల్లో కరోనా యాంటీ బాడీల సంఖ్య పెరుగుతుందని కొన్ని పరిశోధనలు కూడా చెప్పాయి. అయితే ఇలా బూస్టర్ డోస్ ఇవ్వాలనే ఆలోచనను సెప్టెంబరు చివరి వరకూ ధనిక దేశాలు వాయిదా వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. ఈ విషయంలో మోరటోరియానికి డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది. ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ ఘెబ్రెయేసియస్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని అన్ని దేశాల్లో కనీసం 10శాతం ప్రజలకు వ్యాక్సిన్ అందేలా చూడటం కోసమే ఈ నిర్ణయం’’ అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయిన కరోనా వ్యాక్సిన్లలో అధికశాతాన్ని కొన్ని దేశాలే ఉపయోగించుకున్నాయని టెడ్రోస్ అధానం అన్నారు. మిగతా దేశాల్లో రక్షణ కరువైన సమయంలో ఈ దేశాలు.. మరిన్ని వ్యాక్సిన్ డోసులను వాడుకోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-08-05T07:39:41+05:30 IST