ఒమైక్రాన్‌పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-01-07T20:52:39+05:30 IST

కోవిడ్-19 రూపాంతరం ఒమైక్రాన్ తీవ్రమైనది కాదంటూ జరుగుతున్న

ఒమైక్రాన్‌పై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

జెనీవా : కోవిడ్-19 రూపాంతరం ఒమైక్రాన్ తీవ్రమైనది కాదంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒమైక్రాన్  కారణంగా ప్రాణాలు పోతున్న విషయాన్ని గుర్తు చేసింది. చాలా దేశాల్లో ఈ రూపాంతరం సోకినవారు ఆసుపత్రులకు వెళ్ళక తప్పని పరిస్థితి పెరుగుతోందని తెలిపింది. 


డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ స్థానిక కాలమానం ప్రకారం గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కోవిడ్-19 రూపాంతరం డెల్టా కన్నా వేగంగా ఒమైక్రాన్ సోకుతోందని చెప్పారు. చాలా దేశాల్లో ఒమైక్రాన్ బాధితులు ఆసుపత్రులకు తరలి వెళ్తున్నారని తెలిపారు. డెల్టాతో పోల్చుకుంటే ఒమైక్రాన్ తీవ్రత తక్కువగా కనిపించి ఉండవచ్చునని, మరీ ముఖ్యంగా టీకాలు వేయించుకున్నవారిలో తక్కువ తీవ్రత ఉండి ఉండవచ్చునని, అలా అయినంత మాత్రానికి దీని భావం దీనిని తేలికైనదిగా వర్గీకరించాలని కాదని తెలిపారు. 


గతంలో కనిపించిన కోవిడ్-19 రూపాంతరాల మాదిరిగానే ఒమైక్రాన్ కూడా రోగులను ఆసుపత్రులకు వెళ్ళేలా చేస్తోందన్నారు. రోగుల ప్రాణాలను కూడా తీస్తోందని చెప్పారు. వాస్తవానికి ఒమైక్రాన్ కేసుల సునామీ ఎంత తీవ్రంగా ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోందని తెలిపారు. 


గత వారం డబ్ల్యూహెచ్ఓకు అందిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 9.5 మిలియన్ల కోవిడ్-19 కేసులు కొత్తగా నమోదయ్యాయని, ఇది అంతకుముందు వారం కన్నా 71 శాతం ఎక్కువ అని, ఈ లెక్కలు కూడా సరికాదని తెలిపారు. క్రిస్ట్‌మస్, నూతన సంవత్సరం సెలవుల సందర్భంగా పరీక్షలు జరగలేదనే విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా స్వయంగా పరీక్ష చేసుకున్నపుడు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిన కేసులను కూడా రికార్డుల్లో నమోదు చేయలేదన్నారు. నిఘా వ్యవస్థలపై పెను భారం పడటం వల్ల కొన్ని కేసులు రికార్డులకు చేరలేదని చెప్పారు. 


సంపన్న దేశాలు గత ఏడాది అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులను తమ సొంతానికి వాడుకున్నాయని, దీనివల్ల ఈ వైరస్ కొత్త వేరియంట్లు రావడానికి దారి తీసిందని చెప్పారు. 2022లో అయినా మరింత న్యాయబద్ధంగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని కోరారు. 


Updated Date - 2022-01-07T20:52:39+05:30 IST