ప్రఫుల్ పటేల్ను జీవాయుధమన్న ఐషా సుల్తానా ఎవరు?
ABN , First Publish Date - 2021-06-12T02:25:32+05:30 IST
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ను ‘జీవాయుధం’గా అభివర్ణించడంతో
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ను ‘జీవాయుధం’గా అభివర్ణించడంతో ఐషా సుల్తానాపై పోలీసులు ‘దేశద్రోహం’ కేసు నమోదు చేశారు. దీంతో గత రెండు రోజులుగా ఆమె పేరు మార్మోగిపోతోంది. గూగుల్ సెర్చ్లో ఆమె కోసం వెతుకులాట మొదలైంది. బీజేపీ లక్షద్వీప్ అధ్యక్షుడు సి. అబ్దుల్ ఖాదర్ హజీ సుల్తానాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లక్షద్వీప్లో ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై ఓ మలయాళ న్యూస్ చానల్తో సుల్తానా మాట్లాడుతూ కేంద్రంపైనా, ప్రఫుల్ పటేల్పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సుల్తానా మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ‘జీవాయుధం’ అనే పదాన్ని ఉపయోగించినట్టు చెప్పారు. పటేల్, ఆయన విధానాలు అలానే ఉన్నాయని, అందుకనే అలా అభివర్ణించినట్టు పేర్కొన్నారు. తాను పటేల్ను బయోవెపన్గా పేర్కొన్నాను తప్పితే ప్రభుత్వాన్ని కానీ, ఈ దేశాన్ని కానీ తాను ఏమీ అనలేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. బయోవెపన్ అని కాకుండా ఇంకేమని ఆయనని పిలవాలని సుల్తానా ప్రశ్నించారు. లక్షద్వీప్లో ఇటీవల ప్రతిపాదించిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో సుల్తానా ముందున్నారు.
లక్షద్వీప్లోని చెట్లాట్ దీవికి చెందిన వారు ఐషా సుల్తానా. నటి, మోడల్, డైరెక్టర్ కూడా. మలయాళ సినిమా ‘కెట్ట్యోలాను ఎంటే మలాఖా’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గానూ పనిచేశారు. 2020లో ‘ఫ్లష్’ అనే మలయాళ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించారు. సుల్తానాపై దేశద్రోహం అభియోగాలు మోపడాన్ని లక్షద్వీప్ సాహిత్య ప్రవర్తక సంఘం ఖండించింది. ఆమెను దేశద్రోహిగా అభివర్ణించడం సరికాదని పేర్కొంది.
ప్రఫుల్ పటేల్ అమానవీయ విధానాలకు వ్యతిరేకంగానే ఆమె స్పందించారని తెలిపింది. లక్షద్వీప్ను పటేల్ కొవిడ్ సోకిన ప్రాంతంగా తయారు చేయాలని చూస్తున్నారని మండిపడింది. లక్షద్వీప్లోని సాంస్కృతిక సమాజం సుల్తానాతోనే ఉంటుందని సంఘం అధికార ప్రతినిధి కె. బాహిర్ తెలిపారు. పలువురు రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు కూడా ఆమెకు అండగా నిలిచారు. సుల్తానాపై దేశద్రోహం కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.