తర్వాత ఎవరు?
ABN , First Publish Date - 2022-01-17T08:33:41+05:30 IST
తర్వాత ఎవరు?
విరాట్ కోహ్లీ వైదొలగడంతో భారత టెస్టు జట్టు కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వన్డే, టీ20ల్లో సారథిగా ఉన్న రోహిత్ శర్మ రేసులో ముందున్నాడనే కథనాలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ ముగిసేంత వరకు అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉన్నాడు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తే ఈ ఫార్మాట్లోనూ జట్టును హిట్మ్యాన్ ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది. అలాగే కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పేర్లు కూడా ప్రముఖంగానే వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరికీ ఐపీఎల్లో తమ ఫ్రాంచైజీలకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. మరోవైపు ఒకే ఆటగాడిపై మూడు ఫార్మాట్ల బాధ్యతలెందుకని బోర్డు భావిస్తే రాహుల్ టెస్టు కెప్టెన్ అయినా ఆశ్చర్యం లేదు. అందుకే రోహిత్ ఈ రేసులో ముందున్నప్పటికీ.. సెలెక్టర్లు ఈ విషయమై తాజాగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల్లో రెండో మ్యాచ్కు రాహుల్ సారథ్యం వహించాడు. అలాగే ఈనెల 19 నుంచి జరిగే మూడు వన్డేల సిరీ్సలోనూ రోహిత్ లేకపోవడంతో జట్టును అతడే నడిపించనున్నాడు. ఈ సిరీస్ రాహుల్కు నాయకుడిగా చాలా కీలకం కానుంది. మరోవైపు రిషభ్ పంత్కు పగ్గాలు అప్పచెబితే జట్టుకు మేలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల పంత్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించాడని సన్నీ గుర్తు చేశాడు.