ప్రధాని ప్రశంసలు.. సంబరంలో యూట్యూబర్!

ABN , First Publish Date - 2021-07-25T22:06:57+05:30 IST

తాజా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాకు చెందిన ఓ యూట్యూబర్‌‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రోజు కూలీగా పనిచేసిన నాటి నుంచీ ఇంటర్నెట్ సంచలనంగా మారే వరకూ ఐసాక్ ముండా జీవనప్రయాణం స్ఫూర్తి దాయకమన్నారు.

ప్రధాని ప్రశంసలు.. సంబరంలో యూట్యూబర్!

ఇంటర్నెట్ డెస్క్: తాజా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాకు చెందిన ఓ యూట్యూబర్‌‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రోజు కూలీగా పనిచేసిన నాటి నుంచీ ఇంటర్నెట్ సంచలనంగా మారే వరకూ ఐసాక్ ముండా జీవనప్రయాణం స్ఫూర్తి దాయకమన్నారు. ‘‘ఒకప్పుడు ఐసాక్ గారు ఓ సాధారణ రోజు కూలీ. కానీ ఇప్పుడు ఆయనో ఇంటర్నెట్ సెన్సేషన్. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన మెరుగైన సంపాదన కూడా పొందగలిగారు. స్థానిక పద్ధతులు, జీవిన విధానం, ఆహారపు అలవాట్లు, సంప్రదాయ పద్ధతుల్లో వంట చేయడం లాంటి వాటి గురించి వీడియోలు రూపొందిస్తారు’’ అని మోదీ ఐసాక్ గురించి పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ప్రయోజనాలు, స్థానిక వ్యాపారులకు ప్రోత్సాహం మొదలైన అంశాలపై మాట్లాడుతూ ప్రధాని మోదీ ఐసాక్ ప్రస్తావన తెచ్చారు. 


సాక్షాత్తూ దేశ ప్రధాని తన గురించి ప్రస్తావించారని తెలిసి ఐసాక్ ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ‘‘ప్రధాని మోదీ గారు నా పేరును ప్రస్తావించారని తెలిసి పట్టలేనంత సంతోషం కలిగింది.’’ అని ముండా కామెంట్ చేశారు. ఒకప్పుడు తిండి గింజలు కొనుక్కోలేని స్థితిలో ఆకలికి అలమటించిన ఐసాక్ ఆ తరువాత ధైర్యం చేసి ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఆయన యూట్యూబ్ వీడియోలు విపరీతంగా పాపులర్ అవ్వడంతో..ఐసాక్‌కు విపరీతమైన పాపులారిటీ, లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఏకంగా ప్రధాని దృష్టకి వెళ్లిన ఐసాక్ ముండా జీవన ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే ఈ కింది వార్తపైనా ఓ లుక్కేయండి.!

Updated Date - 2021-07-25T22:06:57+05:30 IST