రైలు మధ్యలోనే ఏసీ బోగీలు ఎందుకుంటాయి? ముందు వెనుకలుగా జనరల్ బోగీలు ఎందుకుంటాయో తెలుసా?
ABN , First Publish Date - 2022-01-14T17:05:31+05:30 IST
మీరు ఎప్పుడో ఒకప్పుడు రైలులో ప్రయాణించే ఉంటారు.
మీరు ఎప్పుడో ఒకప్పుడు రైలులో ప్రయాణించే ఉంటారు. రాజధాని, శతాబ్ది వంటి పూర్తిస్థాయి ఏసీ రైళ్లు మినహా చాలా ఎక్స్ప్రెస్ రైళ్లలో మొదట ఇంజిన్, తర్వాత జనరల్ బోగీ, తర్వాత స్లీపర్, ఏసీ బోగీ, ఆఖరున తిరిగి జనరల్ బోగీ ఉంటాయి. అంటే రైలుకు ఇరువైపులా జనరల్ కోచ్లు ఉంటాయి. ఏసీ లేదా పైతరగతి కోచ్లు.. రైలు మధ్యలోనే ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?మీడియాకు అందిన సమాచారం ప్రకారం రైలులోని కోచ్ల ఆర్డర్ను ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తారు. పైతరగతి కోచ్లు, లేడీస్ కంపార్ట్మెంట్లు మొదలైనవి రైలు మధ్యలో ఉంటాయి. జనరల్ బోగీలు రైలుకు ఇరువైపులా ఉంటాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ ఈ విధంగా రూపొందిస్తుంది. రైల్వే స్టేషన్లోని ఎగ్జిట్ గేట్లు స్టేషన్ మధ్యలో ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ప్లాట్ఫారమ్లో రైలు ఆగినప్పుడు ఈ ఏసి కోచ్లు ఎగ్జిట్ గేట్కు దగ్గరగా ఉంటాయి. దీంతో ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు రద్దీ నుంచి తప్పించుకుని త్వరగా బయటికి రాగలుగుతారు. సాధారణ బోగీలో ప్రయాణించేవారు నెమ్మదిగా తరువాత రాగలుగుతారు. జనరల్ కోచ్ల రద్దీ నుండి ఏసీ బోగీలోని ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకే ఇటువంటి వ్యవస్థను కల్పించారు. ఒకవేళ సాధారణ కోచ్లు రైలు మధ్యలోనే ఉంటే గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది వ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు.