తప్పు మాట్లాడకుంటే క్షమాపణలు దేనికి?

ABN , First Publish Date - 2021-12-08T06:13:52+05:30 IST

వైసీపీ నాయకులు తప్పుగా మాట్లాడకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని క్షమించమని, కాళ్లు పట్టుకుంటామని వేడుకోవడం దేనికని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

తప్పు మాట్లాడకుంటే క్షమాపణలు దేనికి?
వాడ్రాపల్లిలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ద, వేదికపై పప్పల, ప్రగడ

 వైసీపీ పాలకులు గౌరవ సభను అగౌరవ పరిచారు

 మాజీ ఎమ్మెల్సీలు బుద్ద నాగజగదీశ్వరరావు, పప్పల చలపతిరావు

మునగపాక, డిసెంబరు 7: వైసీపీ నాయకులు తప్పుగా మాట్లాడకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని క్షమించమని, కాళ్లు పట్టుకుంటామని వేడుకోవడం దేనికని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు  బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. మండలంలోని వాడ్రాపల్లిలో టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం రాత్రి ఏర్పాటైన గౌరవ సభలో మాట్లాడారు. వైసీపీ పాలకులు శాసనసభ విలువ  తీసి, గౌరవ సభను  అగౌరవ పరిచారని ఆరోపించారు. అందుకే చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు శాసన సభలో జరిగిన వివరాలను తెలిజేస్తున్నామని చెప్పారు.  మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి, నేడు ప్రజలను తీవ్రంగా మభ్య పెడుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు పింఛన్‌ ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదన్నారు. పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో టీడీపీ కట్టిన ఇళ్లకు ఈ ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ పేరుతో డబ్బులు వసూలు చేయడమేమిటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ధూళి రంగనాయకులు, భీమరశెట్టి శ్రీనివాసరావు, మళ్ల వరహా నరసింగరావు, కాండ్రేగుల నూక అప్పారావు, మళ్ల శేషు, సూరిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T06:13:52+05:30 IST