ఆస్పత్రిలో భార్య.. ఆమె వెంటే భర్త.. ఇంతలోనే...!

ABN , First Publish Date - 2021-03-13T17:06:24+05:30 IST

భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. భర్త ఆమె వెంట ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో..

ఆస్పత్రిలో భార్య.. ఆమె వెంటే భర్త.. ఇంతలోనే...!

హైదరాబాద్/పంజాగుట్ట : భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. భర్త ఆమె వెంట ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. రహ్మత్‌నగర్‌కు చెందిన ఎన్‌. లక్ష్మి, ఎన్‌. సుబ్బారావు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీలక్ష్మికి ఇటీవల పక్షవాతం రావడంతో రాజ్‌భవన్‌ వద్ద ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 11న సుబ్బారావు కుమార్తె శివానీతో కలిసి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆమె ఇంటికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత శివానీకి ఆస్పత్రి వర్గాలు ఫోన్‌ చేసి సుబ్బారావు, శ్రీలక్ష్మి అపస్మారక స్థితికి చేరుకున్నారని తెలిపాయి. శివానీ ఆస్పత్రికి వెళ్లి చూడగా, అప్పటికే శ్రీలక్ష్మి చనిపోయింది. సుబ్బారావు కొనఊపిరితో ఉండటంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయాడు. సుబ్బారావు విషం తాగినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. శ్రీలక్ష్మి విషం తీసుకుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆమె మెడ చుట్టూ తెల్లటి వస్త్రం ఉంది. ఆమె మరణానికి కారణాలు ఏమై ఉంటాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఆస్తి పిల్లలకే.. 

సుబ్బారావు, శ్రీలక్ష్మిల వద్ద సూసైడ్‌ నోట్‌ లభించింది. మా చావుకు ఎవరూ కారణం కాదని, మా ఆస్తులు మొత్తం పిల్లలకే చెందుతాయని అందులో రాసి ఉంది. అయితే, తమ అంతిమ సంస్కారాలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో జరగాలని సూసైడ్‌ నోట్‌లో రాశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సొంత ఖర్చులతో శ్రీలక్ష్మి అంత్యక్రియలు చేయించారు.  సుబ్బారావు శుక్రవారం రాత్రి మరణించడంతో ఆయన అంతిమ సంస్కారాలు శనివారం నిర్వహించనున్నారు.

Read more