బైక్‌ను ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2021-08-02T05:02:23+05:30 IST

బట్టుకండిగ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతుల్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టిన ఘటనలో భార్య మృతిచెందగా భర్త తీవ్రగాయాలయ్యాయి.

బైక్‌ను ఢీకొన్న కారు
శైలజ(ఫైల్‌ ఫొటో)

భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు 



గంగాధరనెల్లూరు, ఆగస్టు 1: బట్టుకండిగ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతుల్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టిన ఘటనలో భార్య మృతిచెందగా భర్త తీవ్రగాయాలయ్యాయి. ఎస్‌ఐ సుమన్‌ తెలిపిన మేరకు వివరాలు ఇలా ... గంగాధరనెల్లూరు మండలం కోటాగరం దళితవాడకు చెందిన త్యాగరాజులు(27), అతడి భార్య శైలజ(25)లకు సుమారు 8నెలల క్రితమే వివాహం జరిగింది. కాగా త్యాగరాజులు ఠాణాచెక్‌పోస్టు పెట్రోల్‌ బంక్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో శైలజ సర్పంచ్‌గా పోటీచేసి ఓటమిచెందారు. ఈ దంపతులిద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై చిత్తూరుకు వెళుతుండగా పెద్దకాల్వ పంచాయతీ బట్టుకండిగ బస్టాప్‌ సమీపంలో ఆదివారం ఉదయం గంగాధరనెల్లూరు వైపు వస్తున్న కారు ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ద్విచక్రవాహనంపై వస్తున్న దంపతుల్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్యాగరాజులు, శైలజకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన దంపతుల్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శైలజ మృతిచెందగా, త్యాగరాజులు పరిస్థితి తీవ్రంగా ఉందని అక్కడి డాక్టర్లు తెలపడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. 



Updated Date - 2021-08-02T05:02:23+05:30 IST