ఎన్నారై భర్తకు భారీ షాక్.. భార్యపై సీసీకెమెరాలతో నిఘా పెడితే.. ఆమె ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2021-10-16T01:46:05+05:30 IST

భార్యపై నిఘా పెట్టేందుకు ఇల్లాంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఓ ఎన్నారై భర్తకు ఊహించని షాక్ తగిలింది. అదే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాధితురాలు తన భర్త, అతడి తల్లిదండ్రులపై పోలీసు కేసు పెట్టింది.

ఎన్నారై భర్తకు భారీ షాక్.. భార్యపై సీసీకెమెరాలతో నిఘా పెడితే.. ఆమె ఊహించని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: భార్యపై నిఘా పెట్టేందుకు ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఓ ఎన్నారై భర్తకు ఊహించని షాక్ తగిలింది. అదే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాధితురాలు తన భర్త, అతడి తల్లిదండ్రులపై పోలీసు కేసు పెట్టింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2011 నవంబర్‌లో ఆమె వివాహం జరిగింది. ఆ తరువాత మూడేళ్ల పాటు ఆమె సంసారం సాఫీగానే సాగిపోయింది. ఈ క్రమంలో 2014లో ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక అప్పటినుంచీ ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. 


ఆడపిల్లను కన్నదన్న కోపంతో అత్తమామలు ఆమెను నిత్యం వేధింపులకు గురిచేసేవారు. భర్త కూడా తన తల్లిదండ్రులకు వంత పాడేవాడు. 2014లో అతడు ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లిపోయాడు. తననూ వెంట తీసుకెళ్లమని ఆమె పలుమార్లు కోరడంతో 2015లో అతడు భార్యను తన తల్లిదండ్రులను తీసుకెళ్లాడు. వారంతా షికాగో రాష్ట్రంలో ఉండేవారు. అయితే..అమెరికాలోనూ ఆమె వేధింపులు అనుభవించింది. అక్కడ కొత్త ఇల్లు కొనుక్కునేందుకు మరింత కట్నం తేవాలంటూ వారు ఆమెను వేధించేవారు. అయితే..2018లో ఆమె, అత్తమామలతో కలిసి ఇండియాకు తిరిగొచ్చింది. అదే ఏడాది భర్త కూడా భారత్‌కు వచ్చేశాడు. 


ఈ క్రమంలో ముగ్గురూ కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టేవారు. ఆమెపై రోజంతా నిఘా పెట్టేందుకు ఇంట్లో పలు చోట్ల సీసీకెమెరాలు బిగించారు. ఆమెపై పలు మార్లు చేయి చేసుకున్నారు. ఇదంతా సీసీకెమెరాలో రికార్డైపోయింది.  అయితే..2019లో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా కూడా ఆమెకు అత్తింట్లో వేధింపులు కొనసాగాయి. కొంత కాలం క్రితం అతడు మళ్లీ అమెరికాకు వెళ్లిపోయాడు.


అయితే.. అత్తింటి వేధింపులు కొనసాగుతుండటంతో బాధితురాలు గురువారం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంట్లో భర్త అమర్చిన సీసీకెమెరా ఫుటేజీనే సాక్ష్యంగా పేర్కొంది. దీంతో..సీన్ ఒక్కసారిగా తారుమారైపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఎన్నారై భర్తపైనా, అతడి తల్లిదండ్రులపైనా గృహహింస చట్టం కింద కేసు పెట్టారు. ఆమె ఎన్నటికీ పోలీసులకు ఫిర్యాదు చేయదని నిందితులు భావించినట్టు పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.   

Updated Date - 2021-10-16T01:46:05+05:30 IST