పెళ్లయిన 3 నెలలకే భార్య అదృశ్యం.. 13 నెలల పాటు భర్తను జైల్లో పెట్టిన పోలీసులు.. చివరకు బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-11-12T02:51:47+05:30 IST

అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. భార్యను చూసి అతడు మురిసిపోయాడు. తన జీవితమంతా ఇక సుఖసంతోషాలే అనుకుని పొంగిపోయాడు. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే

పెళ్లయిన 3 నెలలకే భార్య అదృశ్యం..  13 నెలల పాటు భర్తను జైల్లో పెట్టిన పోలీసులు.. చివరకు బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్..!

ఇంటర్నెట్ డెస్క్:  అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. భార్యను చూసి అతడు మురిసిపోయాడు. తన జీవితమంతా ఇక సుఖసంతోషాలే అనుకుని పొంగిపోయాడు. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే అతడికి తాను ఊహించుకున్న రీతిలో రియల్ లైఫ్ ఉండదని బోధపడింది. అయినా సర్దుకుపోయాడు.. భార్యతో రాజీ పడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఊహించని షాక్! పెళ్లైన మూడు నెలలకే భార్య కనిపించకుండా పోయింది. ఆమెను హత్య చేశాడన్న ఆరోపణపై అతడు జైలు పాలయ్యాడు. కొంత కాలం క్రితం బెయిలుపై విడుదలైన అతడికి మరో ఊహించని షాక్ తగిలింది. చేయని నేరానికి ఇలా జైలు పాలైనందుకు అతడు నివ్వెరపోయాడు. చిత్రవిచిత్రమైన మలుపులు తిరిగిన దీపూ గోండ్ అనే యువకుడి వైవాహిక జీవితం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆజంగడ్ జిల్లాకు చెందిన దీపూ గోండ్‌కు అదే జిల్లాకు చెందిన రుచి గోండ్‌తో 2019 జూన్ 11న వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజుల వరకూ భార్యభర్తల మధ్య అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత.. ఆమె మరో వ్యక్తితో తరచూ ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ పరిణామం ఇద్దరి మధ్యా పేచీకి దారితీసింది. గొడవ పెద్దదవడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే..ఇరు కుటుంబాల పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో..రుచి మళ్లీ కాపురానికి తిరిగొచ్చింది. ఇదిలా ఉండగా.. ఓ రోజు ఆమె అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది. ఇంట్లో ఉండాల్సిన మూడు లక్షల విలువైన నగలు, నగదు కూడా మాయమయ్యాయి. దీంతో..దీపూ లబోదిబోమన్నాడు. ఇంట్లో ఉండాల్సిన భార్య, నగదు కనిపించకపోవడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాక తల్లకిందులైయ్యాడు. 


మరోవైపు.. అత్తింటివారు దీపూపై పోలీసు కేసుపెట్టారు. అల్లుడు, అతడి కుటుంబసభ్యులు రుచిని కట్నం కూడా వేధించారని, ఆ తరువాత ఆమెను అంతమొందించి.. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నాటకాలాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. దీపూపై హత్యా నేరం కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడు ఏకంగా 13 నెలల పాటు జైలు పాలయ్యాడు. ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు. అయితే.. దీపూ జైలు నుంచి విడుదలయ్యే నాటికే అతడి జీవితం సర్వనాశనం అయిపోయింది. కోర్టు ఖర్చుల కోసం అతడి తండ్రి ఆస్తి మొత్తం అమ్మేశాడు. దీంతో..ఆ కుటుంబం ప్రస్తుతం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బుతుకుతోంది. అయితే..తాను మొదటి నుంచీ నిర్దోషి అని చెబుతున్న దీపూ మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. భార్య కోసం వెతకాలని కోరాడు. దీంతో.. మళ్లీ రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరపగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. రుచిని ఎవరూ చంపలేదని, ఆమె గత కొంతకాలంగా ఆమె ప్రియుడితో రహస్యంగా మరోచోట జీవిస్తున్నట్టు బయటపడింది. ఇలా చేయని నేరానికి జైల్లో గడిపిన దీపూ ఉదంతం ప్రస్తుతం ఆ జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-11-12T02:51:47+05:30 IST