ఆటో డ్రైవర్‌తో భార్యకు వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో.. ప్రియుడితో కలిసి ప్లాన్.. చివరికి..!

ABN , First Publish Date - 2021-10-31T15:30:27+05:30 IST

ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ ఫరీద్‌ అలీతో వివాహేతర సంబంధం ఏర్పడింది...

ఆటో డ్రైవర్‌తో భార్యకు వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో.. ప్రియుడితో కలిసి ప్లాన్.. చివరికి..!

  • బంధమే.. ఉరి తాడై..
  • ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ

హైదరాబాద్ సిటీ/కొత్తపేట : నగరంలో ఈనెల 19న అర్ధరాత్రి జరిగిన డెయిరీ వ్యాపారి హత్య కేసును పహడీషరీఫ్‌ పోలీసులు ఛేదించారు. హతుడి భార్య సహా అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ కేసు వివరాలు వెల్లడించారు.


రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో ఉండే ఓ వ్యక్తి (35) డెయిరీ వ్యాపారం చేస్తున్నాడు. అతడి భార్య(32)కు సంతోష్‌నగర్‌లో ఉండే ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ ఫరీద్‌ అలీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. భర్త వేధిస్తున్నాడని, అతడిని ఎలాగైనా అంతం చేయాలని ప్రియుడితో చర్చించింది. దీంతో అతను తన స్నేహితులు మహ్మద్‌ రియాజ్‌(21), షేక్‌మావియా(28), మహ్మద్‌జహీర్‌(20)లతో కలిసి ఆమె భర్తను అంతం చేసేందుకు పథకం పన్నాడు. ఈనెల 19న రాత్రి భార్య పిలవడంతో భర్త సైదాబాద్‌లోని ఇంటికి వచ్చాడు. అక్కడే ఉన్న ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి ఆమె భర్త గొంతుకు చున్నీతో ఉరిబిగించింది.


మిగతావారు కత్తితో పొడిచి అతన్ని హత్య చేశారు. తర్వాత హతుడి భావేర్యను మహ్మద్‌ జహీర్‌తోపాటు ఆమె తల్లి ఇంటికి పంపారు. అనంతరం సయ్యద్‌ఫరీద్‌ అలీ, రియాజ్‌, జహీర్‌లు పెట్రోల్‌ కొనుగోలు చేసి, ఆటో ట్రాలీలో మృతదేహాన్ని జల్‌పల్లికి తరలించారు. అక్కడ మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. రక్తపు మరకలున్న తమ దుస్తులనూ మంటల్లో పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు జల్‌పల్లి వద్ద కాలిన మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన డిటెక్టివ్‌ పోలీసులు, క్లూస్‌టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతుడు డెయిరీ వ్యాపారి అని గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వినియోగించిన చున్నీ, కత్తి, ఆరు సెల్‌ఫోన్లు, ఆటో ట్రాలీ, రెండు బైకులనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఐ అర్జున్‌, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T15:30:27+05:30 IST