భర్త స్నానానికి వెళ్లిన వెంటనే.. అతడి ఫోన్‌ను చెక్ చేసి కంగుతిన్న భార్య.. తిరిగి రాగానే ఇదేం పని అని నిలదీస్తే..

ABN , First Publish Date - 2021-12-01T23:12:47+05:30 IST

కొన్ని కుటుంబాల్లో భార్యలకు తెలీకుండా, భర్తలు తప్పులు చేస్తుంటారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఇలాగే జరిగింది. భర్త స్నానానికి వెళ్లగానే..

భర్త స్నానానికి వెళ్లిన వెంటనే.. అతడి ఫోన్‌ను చెక్ చేసి కంగుతిన్న భార్య.. తిరిగి రాగానే ఇదేం పని అని నిలదీస్తే..
హేమలత, వినోద్ (ఫైల్)

కొందరు తప్పులు చేస్తూ ఎవరికీ తెలియదులే అనుకుంటూ ఉంటారు. అయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడతాయని గ్రహించరు. అలాంటి స్పృహ ఉండే వాళ్లే అయితే.. అసలు తప్పులే చేయరు. కొందరు ఎన్ని తప్పులు చేసినా చాకచక్యంగా తప్పించుకుంటూ ఉంటారు. కానీ చివరకు చిన్న క్లూతో దొరికిపోతుంటారు. కొన్ని కుటుంబాల్లో భార్యలకు తెలీకుండా, భర్తలు కూడా ఇలాగే తప్పులు చేస్తుంటారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఇలాగే జరిగింది. భర్త స్నానానికి వెళ్లగానే.. అతడి ఫోన్‌ను పరిశీలించిన భార్యకు విస్తుపోయే వాస్తవాలు తెలిసిశాయి. తర్వాత జరిగిన పరిణామాలేంటో చూద్దాం..


చెన్నైలోని వెల్లలార్ వీధికి చెందిన వినోద్ కుమార్, హేమలత అనే మహిళకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఐదేళ్ల కూతురు ఉంది. పెళ్లయిన చాలా సంవత్సరాల వరకూ వారి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదు. కూతురు పుట్టిన కొన్నేళ్ల తర్వాతే అసలు సమస్య మొదలైంది. ఉత్తమురాలైన భార్య దొరికిందని సంతోషించాల్సిన భర్త.. ఇతర మహిళలపై ఆశ పడ్డాడు. అలా కొన్నాళ్లకు భార్యకు తెలీకుండా.. పలువురు మహిళలతో అక్రమ సంబంధం కొనసాగించేవాడు. ఇంట్లో మాత్రం శ్రీరామచంద్రుడిలా నటించేవాడు. మొదట్లో ఆమె.. తన భర్త చాలా మంచివాడనే భ్రమలోనే ఉండేది. అయితే రాను రాను భర్త ప్రవర్తనలో మార్పులు గమనించింది. ఓరోజు విషయం తెలుసుకుని భర్తతో గొడవపడింది.


ఇలా రోజూ వారి కుటుంబంలో గొడవలు జరుగుతుండేవి. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇటీవల ఆమె.. కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి, మళ్లీ కూతుర్ని అత్తగారింటికి పంపించారు. తర్వాత మాత్రం కొన్నాళ్లు ఏ సమస్యలూ లేవు. ఇలా కొనసాగుతున్న క్రమంలో.. భర్త మళ్లీ అక్రమ సంబంధాలు కొనసాగించాడు. భార్యకు మాత్రం అతడిపై అనుమానం కలుగుతూనే ఉండేది. ఓ రోజు భర్త స్నానానికి వెళ్లగానే.. అతడి ఫోన్ తీసుకుని పరిశీలించింది. అందులో చాలా మంది మహిళలతో తన భర్త సాగించిన రాసలీలలన్నీ బయటపడ్డాయి. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది.


ఫోన్‌లోని వీడియోలు చూపించి.. ఏంటిది అంటూ భర్తను నిలదీసింది. గొడవ పెద్దదవడంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయి.. ఒక్కసారిగా భార్యను గొంతు నులిమేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత ఆమె నోట్లో నురగ నింపి, అత్తమామలకు ఫోన్ చేశాడు. మీ కూతురు నురగ కక్కుతూ కింద పడిపోయిందని, ఆస్పత్రికి తరలిస్తుంటే మధ్యలోనే చనిపోయిందని బుకాయించాడు. అక్కడికి చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో చివరకు అసలు విషయం బయటపడింది.

Updated Date - 2021-12-01T23:12:47+05:30 IST