పల్లీలు అందరూ తినొచ్చా?
ABN , First Publish Date - 2021-02-10T17:51:35+05:30 IST
వేరుశెనగ గింజల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు అధికం. వీటిలో కెలొరీలూ ఎక్కువే. వంద గ్రాముల పల్లీల నుండి ఆరువందల కెలొరీలొస్తాయి. పిండి పదార్థాలు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారికి ఇది మంచి ఆహారం. పల్లీలను పరిమితంగా
ఆంధ్రజ్యోతి(10-02-2010)
ప్రశ్న: వేరుశెనగ గింజలు (పల్లీలు) అందరికీ మంచివేనా? అధిక బరువు ఉన్నవారు తిన్నా పర్వాలేదా?
- శివకుమార్, విజయనగరం
డాక్టర్ సమాధానం: వేరుశెనగ గింజల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు అధికం. వీటిలో కెలొరీలూ ఎక్కువే. వంద గ్రాముల పల్లీల నుండి ఆరువందల కెలొరీలొస్తాయి. పిండి పదార్థాలు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారికి ఇది మంచి ఆహారం. పల్లీలను పరిమితంగా తీసుకున్నా వాటిలోని మాంసకృత్తులు, కొవ్వులు, పీచుపదార్థాలవల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకే వేయించిన చిరుతిళ్ల స్థానంలో వేరుశెనగ గింజలను తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ గింజల్లోని కొవ్వులో ఉండే మోనో అన్శాచురేటెడ్, పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తుల వల్ల శరీరంలో జీవక్రియ వేగం కొంత పెరుగుతుంది. ఇవి బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు పల్లీలు తినకూడదు అనేది అపోహ మాత్రమే. మంచి ఆహారం, శారీరక వ్యాయామంతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా రోజుకు పిడికెడు పల్లీలు నానబెట్టి లేదా ఉడికించి లేదా నూనె లేకుండా వేయించి... ఇలా వివిధ రకాలుగా అందరూ తీసుకోవచ్చు. అధిక కెలొరీలు ఉంటాయి కాబట్టి మోతాదుకు మించితే బరువు పెరుగుతారు. పీనట్ ఎలర్జీ ఉన్నవారు మాత్రం వీటికి దూరంగా ఉండాలి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)