రైతులతోనే రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటాం : అఖిలేశ్

ABN , First Publish Date - 2021-01-21T01:57:47+05:30 IST

ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలను రైతులతో కలిసి జరుపుకోవాలని తమ పార్టీ నిర్ణయించినట్టు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు...

రైతులతోనే రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటాం : అఖిలేశ్

లక్నో: ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలను రైతులతో కలిసి జరుపుకోవాలని తమ పార్టీ నిర్ణయించినట్టు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ‘‘జనవరి 26న రైతులతో కలిసి రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవాలని సమాజ్వాదీ పార్టీ నిర్ణయించింది. తద్వారా బడా పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిన బీజేపీని ఎండగడతాం..’’ అని యాదవ్ పేర్కొన్నారు. రైతులు తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారనీ.. వారి అహింసాయుతమైన ఉద్యమం సరికొత్త చరిత్ర సృష్టించిందని అఖిలేశ్ పేర్కొన్నారు. ‘‘రిపబ్లిక్ డే అనేది జాతీయ పండుగ. ఈ రోజుల మన ‘‘అన్నదాత’’ మనందరి గౌరవాన్ని పొందేందుకు అర్హుడు. వారిని అవమానించడం తగదు..’’ అని ఆయన అన్నారు. రైతులను నిర్లక్ష్యం చేయకుండా వారి డిమాండ్లను అంగీకరిస్తే మన దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. ‘‘బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. వారిపైన అనవసరమైన, నిరాధారపూరిత ఆరోపణలు మానుకోవాలి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే రైతుల ప్రధానమైన డిమాండ్..’’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-21T01:57:47+05:30 IST