ప్రజలు కోరితే అజాంగఢ్ నుంచి పోటీ: అఖిలేష్
ABN , First Publish Date - 2022-01-19T19:47:47+05:30 IST
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, అజాంగఢ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ నిర్ణయించినట్టు వార్తలు ప్రచారంలోకి రావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ''అజాంగడ్ ప్రజలు కోరితే ఎన్నికల్లో పోటీ చేస్తా'' అని బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ప్రజల అనుమతి తీసుకుని అజాంగఢ్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని గత ఏడాది అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాగా, 2022 ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిగా సిట్టింగ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అఖిలేష్, మాయావతి, ప్రియాంక గాంధీ వాద్రా పోటీ మాటేమిటని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ మనసు మార్చుకుని ఎన్నికల్లో పోటీకి నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అజాంగఢ్ ప్రజలు కోరితే పోటీ చేస్తానంటూ అఖిలేష్ తాజాగా ప్రకటించడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.