ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయా?
ABN , First Publish Date - 2021-05-08T08:59:47+05:30 IST
బీసీ జాబితాను రాష్ట్రాలు నిర్ణయించలేవంటూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్పై ప్రభావం చూపుతాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు.
- ‘సుప్రీం’ తీర్పుపై నిపుణులను సంప్రదించండి
- తెలుగు రాష్ట్రాలకు షబ్బీర్ అలీ వినతి
హైదరాబాద్, మే 7(ఆంధ్రజ్యోతి): బీసీ జాబితాను రాష్ట్రాలు నిర్ణయించలేవంటూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్పై ప్రభావం చూపుతాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్.. బీసీ-ఈ జాబితా ద్వారా అమలవుతుందన్న సంగతి గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు.. ప్రస్తుతం అమలవుతున్న నాలుగు శాతం ముస్లిం కోటాపై ఎలాంటి ప్రభావం చూపనుందన్నదానిపై న్యాయ నిపుణులను సంప్రదించాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ రిజర్వేషన్తో తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 లక్షల మంది పేద ముస్లింలకు లబ్ధి జరిగిందని, ఈ రిజర్వేషన్ చట్టపరమైన అడ్డంకులు లేకుండా కొనసాగుతుందా? లేదా? అన్నది అధికారులు నిర్ధారించుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.