పంచాయతీ భవనాల నిర్మాణం పూర్తయ్యేదెన్నడో?

ABN , First Publish Date - 2021-12-06T04:56:22+05:30 IST

ఉపాధిహామీ పథకంలో మంజూరైన నూతన పంచాయతీ భవన నిర్మాణాలు పెరిగిన ముడిసరుకుల ధరల మూలంగా మండలంలో అసంపూర్తిగా మిగిలిపోయాయి.

పంచాయతీ భవనాల నిర్మాణం పూర్తయ్యేదెన్నడో?
ధర్మారంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం

 రెండేళ్లుగా అసంపూర్తిగానే భవనాలు

 పెరిగిన ముడిసరుకుల ధరలకు అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని సర్పంచుల వినతి


మద్దూరు, డిసెంబరు 5: ఉపాధిహామీ పథకంలో మంజూరైన నూతన పంచాయతీ భవన నిర్మాణాలు పెరిగిన ముడిసరుకుల ధరల మూలంగా మండలంలో అసంపూర్తిగా మిగిలిపోయాయి. మొదటి విడతలో ఉమ్మడి మండలంలోని సలాఖ్‌పూర్‌, రేబర్తి, వల్లంపట్ల, కూటిగల్‌, తోర్నాల, బెక్కల్‌, దూళిమిట్ట, జాలపల్లి, అర్జున్‌పట్ల, కమలాయపల్లి గ్రామాలకు మంజూరైన భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఉపాధిహామీ పథకంలో మంజూరైన ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించగా నిధులు సరిపోనందున అదనంగా మరో రూ.3 లక్షలు పెంచారు. రెండేళ్ల క్రితం రెండో విడతలో లింగాపూర్‌, ధర్మారం, మర్మాముల, లద్నూరు, వంగపల్లి గ్రామాలకు భవనాలు మంజూరయ్యాయి. అప్పటికే ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం నూతన పంచాయతీ భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టినా ధరల పెరుగుదలతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. లింగాపూర్‌, ధర్మారం మర్మాముల గ్రామాల్లో స్లాబ్‌, గోడల నిర్మాణం పూర్తవ్వగా లద్నూరు, వంగపల్లి గ్రామాల్లో స్థల సమస్యతో ప్రారంభానికి నోచుకోలేదు. గ్రామాభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులు నిర్వహించాల్సిన సమావేశాలు శిథిలావస్థలో ఉన్న పంచాయతీ భవనాల్లో నామమాత్రంగా జరుగుతున్నాయి. నూతన పంచాయతీ భవనాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని పలు గ్రామాల సర్పంచ్‌లు విజ్ఞప్తి చేస్తున్నారు.

 


Updated Date - 2021-12-06T04:56:22+05:30 IST