ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ
ABN , First Publish Date - 2021-06-22T06:09:08+05:30 IST
పలివెల ప్రభుత్వ మద్యం దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి వాచ్మెన్ మెడపై కత్తిపెట్టి రూ.3,26,500 నగదును గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లారు.
కొత్తపేట, జూన్ 21: పలివెల ప్రభుత్వ మద్యం దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి వాచ్మెన్ మెడపై కత్తిపెట్టి రూ.3,26,500 నగదును గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లారు. ఈమద్యం దుకాణం ఊరి శివారు నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. శనివారం, ఆదివారం మద్యం అమ్మకాలను పూర్తిచేసుకుని షాపునకు తాళాలువేసి సూపర్వైజర్ గొల్లపల్లి వెర్రియ్య ఇంటికి వెళ్లిపోయాడు. వాచ్మన్ గుమ్మడి వెంకటేశ్వరరావు షాపువద్ద పడుకొన్నాడు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో ముగ్గురు గుర్తుతెలియని యువకులు మోటారుసైకిల్పై వచ్చి వాచ్మన్ వెంకటేశ్వరరావు మెడపై ఒక వ్యక్తి కత్తి పెట్టగా, మిగిలిన ఇద్దరూ షాపు షట్టర్ తెరిచి గొట్టిలోనికి ప్రవేశించి ఐరన్లాకర్ను బద్దలుగొట్టి నగదును ఎత్తుకెళ్లిపోయారు. సూపర్వైజర్ ఫిర్యాదుతో ఎస్ఐ ఎల్.శ్రీనునాయక్, ఏఎస్ఐ ఆర్వీఎన్ మూర్తి, రావులపాలెం సీఐ వి.కృష్ణ అక్కడకు చేరుకుని చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన క్లూస్టీమ్ వేలిముద్రలు సేకరించింది.