విప్రో లాభంలో స్వల్ప వృద్ధి

ABN , First Publish Date - 2022-01-13T07:52:50+05:30 IST

అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో విప్రో కన్సాలిడేటెడ్‌ లాభం రూ.2,969 కోట్లుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరంలో ఇదే కాలానికి ప్రకటించిన రూ.2,968 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం ..

విప్రో లాభంలో స్వల్ప వృద్ధి

ఒక్కో షేరుపై రూపాయి మధ్యంతర డివిడెండ్‌

2022-23లో 30,000 మంది ఫ్రెషర్ల నియామకం  


అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో విప్రో కన్సాలిడేటెడ్‌ లాభం రూ.2,969 కోట్లుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరంలో ఇదే కాలానికి ప్రకటించిన రూ.2,968 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం రూ.కోటి పెరిగింది. రెండో  త్రైమాసికంతో పోల్చినా 1.3 శాతమే పెరిగింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన 29.6 శాతం వృద్ధి చెంది 20,313.6 కోట్లకు చేరుకుంది. ఆదాయం, ఆర్డర్‌ బుకింగ్‌ పరంగా కంపెనీ పటిష్ఠ పనితీరు కనబర్చిందని విప్రో  సీఈఓ థియరీ డెలాపోర్ట్‌ చెప్పారు. కంపెనీ ఆదాయంలో ఐటీ సేవల విభాగం ద్వారా సమకూరే వాటాయే అధికం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు ఒక్కో షేరుపై రూపాయి మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 


మార్చితో ముగియనున్న నాలు గో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల ఆదాయం 269.2-274.5 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండవచ్చని అంచనా. మూడో త్రైమాసికాదాయంతో పోలిస్తే ఇది 2-4 శాతం అధికం.  ఐటీ సేవల ఆదాయం క్యు2తో పోలిస్తే 2.3 శాతం పెరిగి 263.97 కోట్ల డాలర్లుగా నమోదైంది. 

గడచిన ఏడాది కాలంలో కంపెనీ 10 కోట్ల డాలర్లకుపైగా విలువైన 7 కాంట్రాక్టులను దక్కించుకుంది.


వచ్చే ఏడాది 30 వేల నియామకాలు

విప్రో 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 30,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఫ్రెషర్ల నియామకాలు గతసారితో పోలిస్తే 70 శాతం మేర పెరగనున్నట్లు కంపెనీ పేర్కొంది. డిసెంబరు 31 నాటికి విప్రో ఐటీ సేవల విభాగంలో మొత్తం 2,31,671 మంది పనిచేస్తున్నారు. వార్షిక ప్రాతిపదికన సిబ్బంది సంఖ్య 41,363 పెరిగింది. గత త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 10,306 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ నుంచి ఉద్యోగుల వలసలు 22.7 శాతానికి పెరిగాయి. గడిచిన 9 నెలల్లో 34,000కు పైగా ఫ్రెషర్లను చేర్చుకుంది. 


4 వారాలపాటు కార్యాలయాలు క్లోజ్‌ 

ఒమైక్రాన్‌ వేరియంట్‌ ఉధృతి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలను వచ్చే 4 వారాల పాటు మూసివేయనున్నట్లు విప్రో వెల్లడించింది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రప్పించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ సీఈఓ తెలిపారు. 

Updated Date - 2022-01-13T07:52:50+05:30 IST