లెహ్ కౌన్సిల్ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలు

ABN , First Publish Date - 2020-10-21T22:56:42+05:30 IST

లెహ్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు ఫుల్‌స్టాప్ పడింది. లెహ్ అటానమస్ హిల్స్ డవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్‌డీసీ) ఎన్నికల ..

లెహ్ కౌన్సిల్ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలు

లెహ్: లెహ్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు ఫుల్‌స్టాప్ పడింది. లెహ్ అటానమస్ హిల్స్ డవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్‌డీసీ) ఎన్నికల పోలింగ్ ఈనెల 22న జరుగనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) ద్వారా తొలిసారి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 'లెహ్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించడం ఇది ఆరవ సారి. 22న పోలింగ్ ఉంటుంది. ఈసారి ఈవీఎంల ద్వారా లెహ్ ప్రజలు ఓటు వేస్తారు. లెహ్ కౌన్సిల్‌లో 26 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 94 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 90,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చూసేందుకు మేము కృషి చేస్తున్నాం' అని లెహ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సోనం తెలిపారు.


పర్వత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం ఆషామాషీ కాదని, వాతావరణం, కోవిడ్-19, కమ్యూనికేషన్ వంటి సవాళ్లు ఉంటాయని ఏడీసీ తెలిపారు. జిప్సీ వంటి ఒక ప్రత్యేక వాహనం, మరో నాలుగు ఇతర వాహనాలు అందుబాటులో ఉంచామని, పోలింగ్ అధికారులకు అవసరమైన అన్నపానీయాల వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పోలింగ్ సిబ్బంది, సామగ్రిని తీసుకు వెళ్లేందుకు వీలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయాన్ని కూడా స్థానిక యంత్రాంగం కోరినట్టు చెప్పారు. ఐఏఎఫ్, పవన్‌ హంస్ హెలికాప్టర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. మొత్తం 294 పోలింగ్ బూత్‌‌లు ఏర్పాటు చేశారు.


వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారుల బృందం నేరుగా వాళ్ల ఇళ్లకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వీలు కల్పిస్తారు. కోవిడ్ నేపథ్యంలో ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్, హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి కూడా ఇదే తరహా సౌలభ్యం కల్పిస్తున్నారు. అనుమానిత కోవిడ్ పేషెంట్లు సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. లెహ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన రాజకీయ పార్టీలుగా బరిలో ఉన్నాయి.

Updated Date - 2020-10-21T22:56:42+05:30 IST