మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం అయ్యింది.. 40 లక్షలు టోకరా వేసింది..!

ABN , First Publish Date - 2021-07-13T00:22:50+05:30 IST

మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయ అయిన ఓ మహిళ.. ఓ యువకుడికి రూ.40 లక్షల మేర టోకరా వేసిన వైనమిది. అమెరికా...

మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం అయ్యింది.. 40 లక్షలు టోకరా వేసింది..!

నాగ్‌పూర్: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ.. ఓ యువకుడికి రూ.40 లక్షల మేర టోకరా వేసిన వైనమిది. అమెరికా నుంచి లక్ష డాలర్లతో పాటు, ఓ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ పంపిస్తానంటూ ఆశచూపి.. నాగ్‌పూర్‌కి చెందిన అతడిని సదరు మహిళ మోసగించినట్టు పోలీసులు వెల్లడించారు. తన పేరు సుచితా దాస్ అనీ.. అమెరికాలోకి న్యూజెర్సీలో నివసిస్తున్నానంటూ బాధితుడితో ఆమె పరిచయం చేసుకున్నట్టు నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. ‘‘పురోహితుడు సుశీల్‌కు సంబంధం వెతికేందుకు అతడి సోదరుడు ఇటీవల ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఖాతా  తెరిచాడు. 2019 సెప్టెంబర్‌లో సుచిత అతడిని సంప్రదించింది. ఆమె పరిచయం చేసుకున్న కొద్ది సేపటికే ఇద్దరూ పరస్పరం ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం ఆమె అతడి పెళ్లి ప్రతిపాదనకు కూడా అంగీకరించింది...’’ అని సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ అకోట్ పేర్కొన్నారు.


ఒకానొక సందర్భంలో అమెరికా నుంచి తనకు కొత్త మొబైల్ ఫోన్ పంపాలంటూ సుశీల్ ఆమెను కోరగా.. మొబైల్ ఫోన్‌తో పాటు విరాళంగా లక్ష డాలర్లు కూడా పంపించాలనుకుంటున్నట్టు ఆమె సుశీల్‌‌కి చెప్పింది. గతేడాది అక్టోబర్‌లో తాను లక్ష డాలర్లు, ఓ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లను కొరియర్ ద్వారా పంపిస్తున్నానంటూ ఆమె అతడికి చెప్పినట్టు అధికారులు తెలిపారు. ‘‘కొద్ది రోజుల తర్వాత కస్టమ్స్ అధికారినంటూ ఓ వ్యక్తి సుశీల్‌కు ఫోన్ చేశాడు. కస్టమ్స్ డ్యూటీ కింద కొన్ని లక్షలు కట్టాలంటూ అడిగాడు. దీంతో ఫోన్ చేసినవాళ్లు చెప్పినట్టు వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపాడు..’’ అని విజయ్ అకోట్ పేర్కొన్నారు. మొత్తంగా అమెరికా డాలర్లు, ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్ కోసం అతడు రూ. 40,64,853 చెల్లించినట్టు పోలీసులు వెల్లడించారు. తీరా తాను మోసపోయినట్టు అనుమానం రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మహిళతో పాటు ఢిల్లీకి చెందిన 15 మంది ఇతరులపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-07-13T00:22:50+05:30 IST