నా భర్త 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. న్యాయం చేయండి.. లేదా ఆత్మహత్య చేసుకుంటా.. మహిళ ఆవేదన
ABN , First Publish Date - 2021-10-09T06:12:24+05:30 IST
తన భర్త 3 పెళ్లిళ్లు చేసుకుని తనను మోసం చేశాడని ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయకపోతే..
జలంధర్: తన భర్త 3 పెళ్లిళ్లు చేసుకుని తనను మోసం చేశాడని ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులకు తేల్చి చెప్పింది. ఈ ఘటన పంజాబ్లోని జలంధర్ జిల్లాలో జరిగింది. స్థానిక సరస్వతీ విహార్లో నివశించే నిధీ ఆనంద్ అనే మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2007లో జలంధర్కు చెందిన వ్యక్తితో తనకు వివాహమైందని, తామిద్దరికీ ఓ బిడ్డ కూడా జన్మించాడని చెప్పింది. అయితే ఆ తర్వాత 2011లో ఆయన దుబాబ్ వెళ్లారని, కొన్నాళ్లకు తిరిగొచ్చి మళ్లీ నేపాల్ వెళ్లారని, అయితే 2012 తర్వాత తనతో మాట్లాడడమే మానేశాడని తెలిపింది.
అయితే ఈ మధ్యనే తన భర్త గురించి ఓ దారుణమైన నిజం తెలిసిందని, తన భర్త నేపాల్లో ఎవరినో పెళ్లి చేసుకున్నాడని, ఆమెతో కలిసి ప్రస్తుతం జలంధర్లోనే నివశిస్తున్నాడని తెలిసినట్లు వాపోయింది. బంధువుల రెస్టారెంట్ అని చెబుతున్న ఓ రెస్టారెంట్లో ఆయన పనిచేస్తున్నాడని, అదేమని ఆయన కుటుంబ సభ్యులను నిలదీస్తే తననే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు పోలీసులే న్యాయం చేయాలని, లేకపోతే స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని కన్నీరు పెట్టుకుంది. దీనిపై స్పందిచిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.