దోమల కోసం పొగ వేసి పడుకున్నారు.. ఉదయం లేచి చూసేసరికి..!
ABN , First Publish Date - 2021-07-23T16:41:33+05:30 IST
ఇంటిలో దోమలు ఎక్కువగా ఉండడంతో గదిలో నిప్పులతో పొగ వేశారు..
ఇంటిలో దోమలు ఎక్కువగా ఉండడంతో గదిలో నిప్పులతో పొగ వేశారు.. తలుపులన్నీ వేసేసి ఏసీ ఆన్ చేసి పడుకున్నారు.. తర్వాతి రోజు ఉదయం వారు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.. గది తలుపులు పగలగొట్టి చూడగా ఒక మహిళ మృతి చెందింది.. మిగతా ముగ్గురూ ఆస్పత్రిలో పోరాడుతున్నారు. దోమల కోసం వేసిన పొగ వల్ల ఊపిరాడకపోవడంతోనే ఇలా జరిగిందని తేలింది. చెన్నైలోని పమ్మల్ తిరువళ్లువర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
తిరువళ్లువర్కు చెందిన చొక్కలింగం (53) ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండడంతో అతని భార్య పుష్పలక్ష్మి ప్లేట్లో బొగ్గులు ఉంచి దానిలో నూనె పోసి నిప్పు పెట్టారు. తలుపులన్నీ వేసుకుని ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోయారు. బయటకు వెళ్లే దారి లేకపోవడంతో పొగ గది అంతా వ్యాపించింది. ఆ పొగ వల్ల వారంతా నిద్రలోనే స్పృహ కోల్పోయారు. గురువారం ఉదయం ఎంతసేపటికీ వారు బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వేళ్లారు. పుష్పలక్ష్మి అప్పటికే చనిపోగా.. మిగిలిన వారంతా అపస్మాకర స్థితిలో ఉన్నారు. దీంతో వారిని వెంటనే చెన్నై రాజీవ్గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.