తల్లి అంత్యక్రియలకు కుమారుని వేడుకోలు.. ముఖం చాటేసిన ఇరుగుపొరుగు!
ABN , First Publish Date - 2021-05-03T17:28:33+05:30 IST
కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని కూడా మింగేస్తోంది.
జైత్పూర్: కరోనా మహమ్మారి మనుషుల్లోని మానవత్వాన్ని కూడా మింగేస్తోంది. కరోనా బాధితులను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఇక కరోనా మృతుల విషయం చెప్పనలవికాదు. ఢిల్లీలోని జైత్పూర్నకు చెందిన ఒక యువకునికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ యువకుని తల్లి మృతి చెందగా, ఆసుపత్రి సిబ్బంది ఆ మృతదేహాన్ని అంబులెన్లో తీసుకువచ్చి, అతని ఇంటి ముందు ఉంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను చూడగానే అతని ఇంటి చుట్టుపక్కలవారు కనీస సాయం చేయకపోగా, వారి ఇంటి తలుపులు వేసుకున్నారు.
అతని బంధువులు కూడా ఆదుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ యువకుడు సాయం కోసం పోలీసులను అర్ధించాడు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ యువకునికి సాయం అందిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఆ యువకుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి ఆర్పీ మీణా మాట్లాడుతూ ఏప్రిల్ 30న ఒక యువకుడు తమకు పోన్ చేసి, అంత్యక్రయల కోసం సాయం అర్థించాడన్నారు. అనారోగ్యంతో అతని తల్లి కృష్ణాదేవి మృతి చెందిందని తెలిపాడన్నారు. తాము వెళ్లి అతనికి సాయం అందించామన్నారు.