రూ.12 లక్షలకే BMW కారు.. భర్తకు గిఫ్టు ఇద్దామనుకున్న భార్య.. సైబర్ నేరగాళ్ల చేతిలో బలి

ABN , First Publish Date - 2021-12-31T12:11:37+05:30 IST

భర్తకు BMW కారుని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇద్దామనుకున్న ఒక మహిళ వద్ద మోసగాళ్లు రూ.12 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో...

రూ.12 లక్షలకే BMW కారు.. భర్తకు గిఫ్టు ఇద్దామనుకున్న భార్య.. సైబర్ నేరగాళ్ల చేతిలో బలి

భర్తకు BMW కారుని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇద్దామనుకున్న ఒక మహిళ వద్ద మోసగాళ్లు రూ.12 లక్షలు దోచుకున్నారు.  ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. 


ఝార్ఖండ్ రాజధాని రాంచీలో నివసించే బబితా అనే మహిళకు ఒక రోజు ఫోన్ వచ్చింది. "మీకు అన్‌లైన్‌లో లాటరీ తగిలింది.. రూ.70 లక్షలు విలువ చేసే BMW కారు కేవలం రూ.12 లక్షలకే దక్కుతుంది. వెంటనే రూ.12 లక్షలు చెల్లించండి" అని మోసగాళ్లు చెప్పారు. ఇంట్లో ఒక కారు ఉంటే బాగుంటదని.. ఎప్పటినుంచో అనుకుంటున్న బబితాకు ఆ ఫోన్ వినగానే పట్టరానంత సంతోషం కలిగింది. ఈ వార్త భర్తకు చెప్పకుండా అతనికి  BMW కారు  సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇద్దామనుకుంది. అందుకని బబితా తన వద్దనున్న కొంత డబ్బు, నగలు అమ్మి ఆ ఫోన్ చేసిన వారికి రూ.12 లక్షలు ఇచ్చేసింది.


డబ్బు చెల్లించిన తరువాత రోజులు గడిచినా ఇంటికి BMW కారు రాకపోవడంతో.. ఆందోళన చెందిన బబితా.. ఈ విషయం తన భర్తకు వివరించింది. దీంతో బబితా భర్త ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఆన్‌లైన్ మోసగాళ్ల గురించి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఆ కేటుగాళ్ల కోసం గాలిస్తున్నారు. మరోవైపు బబితా భర్త డిసెంబర్ 13 నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. 


పోలీసులు, బ్యాంకులు నిత్యం ప్రజలకు అన్‌లైన్ మోసాల గురించి హెచ్చరిస్తూనే ఉన్నాయి. తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి లాటరీ తగిలిందని, లేక మంచి ఆఫర్ అని ఆశచూపి డబ్బులు చెల్లించమని అడిగితే.. వెంటనే సమాచారమందించాలని పోలీసులు చెబుతున్నారు.


Updated Date - 2021-12-31T12:11:37+05:30 IST