భర్త ఇంట్లోకి రాగానే షాకింగ్ సీన్.. గదిలో రెండు శవాలు.. కుర్చీలో స్పృహ లేకుండా భార్య..
ABN , First Publish Date - 2022-01-03T10:00:52+05:30 IST
రాత్రి భర్త ఇంటికి వచ్చాడు. ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. లోపలి నుంచి పొగ రావడం చూసి.. అతను తలుపులు బద్దలు కొట్టాడు. లోపలికి వెళ్లి చూడగా.. అతని భార్య కుర్చీలో కట్టేసి ఉంది. పక్క గదిలో మంటలు చెలరేగుతున్నాయి. ఆ గదిలో అతని తల్లిదండ్రుల మృతదేహాలు...
రాత్రి భర్త ఇంటికి వచ్చాడు. ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. లోపలి నుంచి పొగ రావడం చూసి.. అతను తలుపులు బద్దలు కొట్టాడు. లోపలికి వెళ్లి చూడగా.. అతని భార్య కుర్చీలో కట్టేసి ఉంది. పక్క గదిలో మంటలు చెలరేగుతున్నాయి. ఆ గదిలో అతని తల్లిదండ్రుల మృతదేహాలు ఉన్నాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్ పూర్ జిల్లాలో జరిగింది.
పంజాబ్లోని హోషియార్ పూర్ జిల్లా పరిధి జాజా గ్రామంలో నివసించే రవీందర్ సింగ్ 2019లో మందీప్ కౌర్తో వివాహం జరిగింది. వివాహం జరిగిన సంవత్సరానికి రవీందర్ సింగ్ పోర్చుగల్ దేశానికి ఉద్యోగ రీత్యా వెళ్లాడు. కరోనా కారణంగా సంవత్సరం వరకు తిరిగిరాలేకపోయాడు. ఇటీవల 2022 జనవరి 1న అతను ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు తన తల్లిదండ్రులు, భార్యను చాలా కాలం తరువాత చూసి సంతోష పడ్డాడు. ఊర్లోని స్నేహితులను కలిసి వచ్చేందుకు అదే రోజు బయటికి వెళ్లాడు. అలా వెళ్లిన అతను రాత్రి 10 గంటల తరువాత ఇంటికి వచ్చాడు.
ఎంతసేపు తలుపులు తట్టినా ఎవరూ తీయలేదు. ఇంతలో లోపలి నుంచి పొగ రావడం అతను గమనించి.. తలుపులు పగలకొట్టాడు. లోపలికి వెళ్లి చూడగా.. అతని భార్య మందీప్ను ఎవరో కుర్చీకి కట్టిపడేశారు. పక్కగదిలో నుంచి మంటలు వస్తున్నాయి. ఆ గదిలో అతని తల్లిదండ్రుల మృతదేహాలు ఉన్నాయి. ఏం జరిగిందని భార్యను రవీందర్ అడిగాడు. అప్పుడు మందీప్ అతనికి ముగ్గురు దొంగలు ఇంట్లో చొరబడ్డారని.. గదిలోని నగలు, డబ్బులు దొంగిలించి.. అడ్డువచ్చిన రవీందర్ తల్లిదండ్రులను హత్య చేశారని తెలిపింది. దీంతో రవీందర్ పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు రవీందర్, మందీప్ని విచారణ చేయగా.. మరో కోణం వెలుగులోకి వచ్చింది. రవీందర్ పోర్చుగల్లో ఉన్నప్పుడు మందీప్ తన ఇంట్లో అత్తమామలతో గొడవపడేది. దానికి కారణం ఆమె ఫోన్లో గంటల తరబడి ఎవరితోనూ మాట్లాడుతూ ఉండడం. ఒకరోజు మందీప్ మరో పురుషుడితో దొంగచాటుగా మాట్లాడడం ఆమె మామ(రవీందర్ తండ్రి) చూశాడు. ఈ విషయం రవీందర్కు ఫోన్లో చెప్పాడు. కొద్ది రోజుల తరువాత మందీప్కు అదే గ్రామంలోని గురుద్వారా(సిక్కుల ప్రార్థనా స్థలం)లో పనిచేసే జస్మీత్ సింగ్తో సంబంధం ఉందని అత్తమామలకు అనుమానం కలిగింది. దీంతో వాళ్లు రవీందర్ను త్వరగా ఇంటికి రావాలని చెప్పారు.
రవీందర్ ఇంటికి వచ్చిన రోజే ఇంట్లో తన తల్లిదండ్రులు హత్యచేయబడడంతో అతనికి భార్య అనుమానం వచ్చింది. పోలీసులకు ఈ విషయమంతా వివరించాడు. మందీప్ చెప్పినట్లు ఇంట్లో ముగ్గురు దొంగలు వచ్చి చోరీ చేస్తూ అడ్డొచ్చిన రవీందర్ తల్లిదండ్రులను హత్య చేసే కథనం పోలీసులు నమ్మలేదు. దానికి కారణం ఇంట్లోని వెనుక భాగంలో ఒక కిటికీ తెరిచి ఉంది. దొంగతనం చేసిన వారు బయటి నుంచి వెళ్లే అవకాశమున్నా.. కిటికీ ఎందుకు ఉపయోగించారని పోలీసులకు సందేహం కలిగింది.
దీంతో రవీందర్ చెప్పినట్లు అతని భార్య మందీప్కు అక్రమ సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు చేశారు. గ్రామంలోని గురుద్వారాలో పనిచేసే జస్మీత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పోలీసులు గట్టిగా విచారణ చేయగా.. అతను నిజం ఒప్పుకున్నాడు. ఇదంతా మందీప్ ప్లాన్ అని అతను చెప్పాడు. తాను కేవలం ఆమె చెప్పినట్లు చేశానని.. రవీందర్ ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లి అతని తల్లిదండ్రులను కత్తితో పొడిచి హత్యచేశానని తన నేరం ఒప్పుకున్నాడు. హత్య చేశాక, ఇంట్లో దొంగతనం జరిగినట్లు కనిపించడానికి.. మందీప్ను తాళ్లతో కుర్చీకి కట్టేసి నగలు తీసుకెళ్లానని వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో పోలీసులు హత్యా నేరం నమోదు చేసి మందీప్ని కూడా అరెస్టు చేశారు.