కొడుకు చనిపోయిన ఏడాది తర్వాత దొరికిన సూసైడ్ నోట్.. తల్లికి అసలు విషయం తెలిసి..

ABN , First Publish Date - 2021-01-14T22:47:57+05:30 IST

కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఏడాది తర్వాత అతడి తల్లికి సూసైడ్ నోట్ లభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిన వైనమిది....

కొడుకు చనిపోయిన ఏడాది తర్వాత దొరికిన సూసైడ్ నోట్.. తల్లికి అసలు విషయం తెలిసి..

అహ్మదాబాద్: కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఏడాది తర్వాత అతడి తల్లికి సూసైడ్ నోట్ లభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిన వైనమిది. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అతడు పూసగుచ్చినట్టు వివరించడంతో న్యాయం కోసం ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై వివరాల్లోకి వెళ్తే.. మాధవ్ అనే వ్యక్తి 2020 ఏప్రిల్‌ 9న నర్మదా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరుసటి రోజు అతడి మృతదేహాన్ని బయటికి తీశారు. అప్పట్లో మాధవ్ తల్లికి అతడు ఎందుకు చనిపోయాడో తెలియక మౌనంగా ఉండిపోయారు. అయితే అంతకంటే ఏడాది ముందే 2019 ఏప్రిల్‌లో మాధవ్ సూసైడ్ నోట్ రాసుకున్నాడు. అది అతడి కప్‌బోర్డులో ఓ బెడ్‌షీట్ మధ్యన ఉండిపోయింది. 


ఈ ఏడాది జనవరిలో అతడి తల్లి లీలా జాదవ్‌ తన కుమారుడి కప్‌బోర్డు శుభ్రం చేస్తుండగా సదరు లేఖ ఆమెకు దొరికింది. తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తన ముందే అసభ్యంగా ప్రవర్తించడంతో తట్టుకోలేక ఆత్మహత్య నిర్ణయానికి వచ్చినట్టు మాధవ్ ఆ లేఖలో వెల్లడించాడు. సరిగ్గా వివాహానికి కొద్ది రోజుల ముందే తనకు శారీరక సమస్యలు తలెత్తడంతో.. ఆ బలహీనతను సాకుగా తీసుకుని ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు అతడు వివరించాడు. తన కళ్ల ముందే భార్య పరాయి వ్యక్తిని ఇంటికి పిలిపించుకుని అతడితో గడపడం మొదలు పెట్టిందని వాపోయాడు. ‘‘ఇలాంటి పనులు నన్ను బాధిస్తున్నాయనీ.. వాళ్లిద్దర్నీ విడిపోవాలని నేను చాలాసార్లు చెప్పాను. అయినా వాళ్లు నన్ను నిత్యం అవమానిస్తూ వచ్చారు. ఆ ఇద్దరు తమ చర్యలను ఆపేందుకు అంగీకరించనందున నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను..’’ అని మాధవ్ తన లేఖలో పేర్కొన్నాడు. మాధవ్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-01-14T22:47:57+05:30 IST