ఉసురుతీసిన క్షణికావేశం

ABN , First Publish Date - 2021-01-16T05:22:04+05:30 IST

క్షణికావేశం ఒకరి ప్రాణాలను బలిగొంది. ఇద్దరు చిన్నారులను తల్లికి దూరం చేసింది

ఉసురుతీసిన క్షణికావేశం
మంగమ్మ మృతదేహం




భర్త చేతిలో మహిళ హతం
అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు
కూరాడ వారి కల్లాల వద్ద ఘటన
భోగాపురం, జనవరి 15:
క్షణికావేశం ఒకరి ప్రాణాలను బలిగొంది. ఇద్దరు చిన్నారులను తల్లికి దూరం చేసింది. తండ్రిని జైలుపాలు చేసింది. భోగాపురం మండలం కొంగవానిపాలెం సమీపంలోని కూరాడ వారి కల్లాల వద్ద జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కొంగవానిపాలెం గ్రామానికి చెందిన బేతల గోవిందరావుకు పదేళ్ల కిందట కూరాడ కల్లాలకు చెందిన మంగమ్మ (27)తో వివాహం జరిగింది. కూరాడ కల్లాల్లో నివాసముంటున్నారు. వీరికి రాజేష్‌, రమేష్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడం, పెద్దల పంచాయతీకి వెళ్లడం జరుగుతూ వస్తోంది. పోలీసు కేసుల వరకూ వెళ్లినా వారు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేవారు. ఈ నేపథ్యంలో గోవిందరావు స్వగ్రామం కొంగవానిపాలెం గ్రామానికి కుటుంబంతో కలిసి వెళ్లారు. సంక్రాంతి జరుపుకొని తిరిగి కూరాడ కల్లానికి వచ్చేశారు. ఇంతలో బంగారం కోసం ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న మంగమ్మ అన్నదమ్ములు అప్పలనర్సు, సూరిలు సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన గోవిందరావు ఇనుప రాడ్డుతో వారిపై దాడిచేశాడు. దీంతో వారు గాయపడ్డారు. అనంతరం భార్య మంగమ్మ తలపై బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వచ్చి చూసేసరికి మృతిచెందింది. గోవిందరావు అక్కడ నుంచి పరారయ్యాడు.  సమాచారమందుకున్న ఎస్‌ఐ మహేష్‌ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గోవిందరావు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి.  హత్య చేసేవరకూ వస్తాయని అనుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. తల్లి మృతి, తండ్రి పరారుకావడంతో చిన్నారులు బేలచూపులు చూస్తుండడం అక్కడున్న వారిని కలిచివేసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



Updated Date - 2021-01-16T05:22:04+05:30 IST