అద్దెకు దిగిన కొత్త జంట.. మూడో రోజే గదిలోంచి తీవ్ర దుర్వాసన.. యజమానురాలు వెళ్లి కిటికీలోంచి చూస్తే..

ABN , First Publish Date - 2021-07-13T18:54:48+05:30 IST

‘అమ్మగారూ.. మేం కొత్తగా పెళ్లి చేసుకున్నాం. ఈ నగరంలోనే ఏదో ఒక పనిచేసుకుని బతుకుదామని వచ్చాం. అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాం. మీ ఇంట్లో పై గది ఖాళీ ఉందని తెలిసింది. మాకు ఇవ్వగలరా?’ అంటూ ఎంతో దీనంగా అడిగేసరికి ఆ యజమానురాలు కాదనలేకపోయింది.

అద్దెకు దిగిన కొత్త జంట.. మూడో రోజే గదిలోంచి తీవ్ర దుర్వాసన.. యజమానురాలు వెళ్లి కిటికీలోంచి చూస్తే..

‘అమ్మగారూ.. మేం కొత్తగా పెళ్లి చేసుకున్నాం. ఈ నగరంలోనే ఏదో ఒక పనిచేసుకుని బతుకుదామని వచ్చాం. అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాం. మీ ఇంట్లో పై గది ఖాళీ ఉందని తెలిసింది. మాకు ఇవ్వగలరా?’ అంటూ ఎంతో దీనంగా అడిగేసరికి ఆ యజమానురాలు కాదనలేకపోయింది. పైకి వెళ్లి గది చూసుకుని రండి అని చెప్పింది. వాళ్లు వెళ్లి ఆ గదిని చూశారు. తిరిగి కిందకు వచ్చి గది నచ్చిందని చెప్పారు. అద్దె ఎంతన్నది కూడా ఆ యజమానురాలు చెప్పింది. దానికి కూడా ఆ కొత్త జంట సరేనంది. మరుసటి రోజే అద్దె ఇంట్లోకి ఆ కొత్త జంట దిగారు. గదిలోకి వచ్చినప్పటి నుంచి వాళ్లు బయటకు రావడమే మానేశారు. కొత్తగా పెళ్లయింది కదా అని ఆ యజమానురాలు కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. మూడో రోజే తీవ్ర దుర్వాసన రావడం మొదలయింది. ఎక్కడి నుంచా అని ఆరా తీస్తే.. అద్దెకు ఇచ్చిన గదిలోంచే అని ఆ యజమానురాలు గ్రహించింది. తలుపులు ఎన్నిసార్లు కొట్టినా తీయకపోవడంతో.. కిటికీలోంచి చూసింది. అంతే లోపల కనిపించిన దృశ్యం చూసి నివ్వెరపోయింది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఉరేసుకుని చనిపోయారు. మృతదేహాలు కుళ్లిపోవడంతోనే వాసన రావడం మొదలయింది. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగర్ జిల్లాలోని అట్రౌలీ పరిధిలో ఉన్న మొహల్లా సరైవలీ ప్రాంతంలో సుశీలా దేవీ అనే మహిళ ఇంట్లోకి ఓ జంట అద్దెకు దిగారు. విమ్లేష్ దేవీ అనే మహిళను తన భార్యగా యజమానురాలికి పరిచయం చేసి రవీ అనే వ్యక్తి అద్దె ఇంట్లో కొత్త కాపురం మొదలు పెట్టారు. అయితే వాళ్లు అద్దె గదిలోకి దిగిన మూడోరోజే ఆదివారం తీవ్ర దుర్వాసన రావడం మొదలయింది. ఏమయిందా ఏంటా అని యజమానురాలు వెళ్లి పరిశీలిస్తే.. గదిలో ఫ్యాన్‌కు ఆ కొత్త జంట ఉరేసుకుని కనిపించారు. దీంతో భయాందోళనకు గురయిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఆ మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ‘కొద్ది రోజుల క్రితమే పెళ్లయిందన్నారు. అద్దె గది కావాలన్నారు. ఇచ్చాను. అంతకు మించి నాకేమీ తెలియదు. పెద్దగా బయట కనిపించకపోవడంతో కొత్తగా పెళ్లయింది కదా అని భావించాను. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు’ అంటూ యజమానురాలైన సుశీలా దేవీ వాపోయింది. 


ఇక పోలీసుల విచారణలో మరో షాకింగ్ నిజం తెలిసింది. రవి, విమ్లేష్ దేవీ పెళ్లి చేసుకున్న సంగతి నిజమే కానీ.. అంతకుముందే విమ్మేష్ దేవీకి శిషుపాల్ అనే వ్యక్తితో వివాహమయింది. ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భర్తను, కుమారుడిని వదిలేసి.. పెళ్లికి ముందు నుంచి పరిచయం ఉన్న రవితో విమ్వేష్ దేవీ వచ్చేసింది. ఆ తర్వాత ఓ గుడిలో రవి, విమ్లేష్ దేవీ పెళ్లి చేసుకున్నారు. అయితే తన భార్య కనిపించడం లేదంటూ ఆ భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీళ్లిద్దరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాము ఇలా వచ్చేయడంతో ఊళ్లో వాళ్లు  నానా మాటలు అంటున్నారని తెలిసి బాధతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వారి సొంతూళ్లకు తరలించి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-07-13T18:54:48+05:30 IST