పురిటి నొప్పులు పడుతూ బాస్‌కు మెసేజీ పెట్టిన మహిళ.. నెటిజన్లకు చిర్రెత్తించిన ఘటన

ABN , First Publish Date - 2021-12-03T02:42:05+05:30 IST

బిజీ మహిళకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లకు మండుకొచ్చేలా చేస్తోంది.

పురిటి నొప్పులు పడుతూ బాస్‌కు మెసేజీ పెట్టిన మహిళ..  నెటిజన్లకు చిర్రెత్తించిన ఘటన

ఇంటర్నెట్ డెస్క్: నేటి ఆధునిక సమాజం ఉద్యోగస్తులకు క్షణం తీరిక లేకుండా చేసేసింది. పురుషుల సంగతి అటుంచితే.. ఉద్యోగాలు చేసే మహిళల కష్టాలు ఎంత చెప్పుకున్నా తక్కువే! కొన్ని సందర్భాల్లో ఇది వారి వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపుతోంది. అటువంటి ఓ బిజీ మహిళకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లకు మండుకొచ్చేలా చేస్తోంది. ఈ ఆధునిక జీవన విధానంపైనే ఏవగింపు కలిగిస్తోంది.


మెర్రిసా అనే మహిళ ఆస్పత్రి బెడ్‌పై పురిటి నొప్పులు పడుతూ తన బాస్‌కు మెసేజీ పెట్టింది. ‘‘నాకు నొప్పులు మొదలయ్యాయి, ఇప్పుడే ఆస్పత్రిలో చేరాను. నా సొదరుడు కానీ..అమ్మ గానీ ఆఫీసుకు వచ్చి నా సాలరీ చెక్ తీసుకోవచ్చా..?’’ అంటూ ఆమె తన మొబైల్‌లో మెసేజ్ టైప్ చేసింది. తాను రాసినదాన్ని తన జీవిత భాగస్వామికి చదివి వినిపించి ఆ తరువాత మెసేజీ పంపించింది. అతడు ఇదంతా వీడియోలో రికార్డు చేశారు. ఆ తరువాత ఇది సోషల్ మీడియా బాట పట్టి విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి ఏడాది క్రితం ఈ ఘటన జరిగినప్పటికీ..ఈ వీడియో ఇప్పటికీ చర్చలు రేకెత్తిస్తోనే ఉంది. ఇప్పటివరకూ ఏకంగా 50 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 


ఆధునిక ప్రపంచంలో వనితల ఇబ్బందులు చెప్పతరం కాదంటూ ఇది చూసిన ప్రతిఒక్కరూ మండిపడుతున్నారు. కాగా.. ఈ ఘటనపై మెరిస్సా స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అసలే నాకు యాంగ్జైటీ సమస్య ఉంది. నాకు ఇదే తొలి కాన్పు! దీనికి తోడు వైద్యులు చెప్పిన దాని కంటే వారం ముందుగానే నొప్పులు మొదలయ్యాయి.  దీంతో..  సెలవు కావాలంటూ అకస్మాత్తుగా బాస్‌కు ఎలా చెప్పాలా అనే విషయంలో కాస్తంత సతమతమయ్యాను’’ అని ఆమె పేర్కొంది.  మరో షాకింగ్ విషయం ఏంటంటే.. భార్యాభర్తలిద్దరికీ బిడ్డ పుట్టాక ఎటువంటి సెలవులూ మంజూరు కాలేదట. మెర్రిసాకు మెటర్నిటీ సెలవులు మంజూరు కాకపోగా.. ఆమె భర్తేమో బిడ్డ పుట్టిన రెండో రోజే ఆఫీసుకు వెళ్లిపోయాడట.

Updated Date - 2021-12-03T02:42:05+05:30 IST